నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ `ప్రతినిధి 2`. ఈ చిత్ర ట్రైలర్ని తాజాగా విడుదల చేశారు. పొలిటికల్ సెటైర్లతో అదిరిపోయేలా ఉంది ట్రైలర్.
నారా రోహిత్ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. తనకు హిట్ని అందించిన `ప్రతినిధి` మూవీకి సీక్వెల్తో వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాలనే లక్ష్యంగా `ప్రతినిధి 2` చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు(టీవీ5 మూర్తి) దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సమకాలీన రాజకీయాలను ప్రధానంగా చేసుకుని ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పొలిటికల్ సెటైరికల్గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
`మన దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం పోరాడిన గాంధీ చనిపోయినప్పుడు ఎంత మంది గుండెపోటుతో చచ్చారు` అని నారా రోహిత్ ప్రశ్నించే సీన్లతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత వరుసగా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటాయి. కట్ చేస్తే రాజకీయ నాయకుడైన అజయ్ ఘోష్ని నారా రోహిత్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. మీలా కష్టపడాలంటారు అని అడగ్గా, మరీ నేనైతే కొండ మీద కొబ్బరి కాయాలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చాను. ఊరికెనే అయిపోతారా? పెద్దోళ్లు అంటాడు అజయ్ ఘోష్. దీనికి మరేంటి సర్ కాయలు అమ్ముకునే వాళ్లు ఇంకా కాయలే అమ్ముకుంటున్నారు, మీరెలా సార్ కోటీశ్వరులయ్యారు అని యాంకర్ స్థానంలో ఉన్న నారా రోహిత్ ప్రశ్నించడంతో ఆయన నీళ్లు నమిలారు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సర్ అని నిలదీశాడు. దీనికి సమాధానం లేదు.
ఆ తర్వాత పృథ్వీ పాత్ర ఎంట్రీ ఇస్తూ అరేయ్ నా పెళ్లి వీడియో కూడా ఇన్నిసార్లు చూడలేదని, షో మీద షో వేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు పృథ్వీ. ఆసుపత్రిలో ఓ పేషెంట్.. ఆయన మా దేవుడు సర్, ఆయనకు ఇలా జరిగిందని తెలియగానే.. అని ఆగిపోగా, నిన్ను నమ్ముకున్న భార్యబిడ్డల కంటే నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? అని ప్రశ్నించాడు నారా రోహిత్.
ఆ తర్వాత యంగ్ పొలిటీషియన్ సీఎం అవుతాడు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ కుటుంబంలో అన్నని కోల్పోయిన వారికి అన్నలా, కొడుకుని కోల్పోయిన వారికి కొడుకులా ఉంటానని మాటిస్తున్నా అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక సీఎంకి ఈ సారి మనం గెలవడం కష్టం విశ్వ, సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేశాం అని మరో పొలిటికల్ సలహాదారు అనడంతో మిగిలిన నాయకులు నవ్వడం ఆకట్టుకుంది. ఆ తర్వాత అందరికంటే ముందే మీ ఛానెల్లో వార్తలు ఎలా వస్తున్నాయని పోలీసులు నారా రోహిత్ ని అరెస్ట్ చేసి విచారించడం, అనంతరం రాజకీయ నాయకులపై తిరగబడటం ఆకట్టుకుంది.
ఓవరాల్గా `ప్రతినిధి 2` ట్రైలర్ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీశారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు, ఆయన ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నట్టుగా ఉంది. ఇందులో మీడియాపై జరిగే దాడులను ప్రస్తావించారు. కొద్దిగా తెలంగాణ రాజకీయాలను కూడా టచ్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకుంటూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. చివరగా `ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు వాడు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో, వాడా? వీడా? అనే చెప్పే డైలాగ్ అదిరిపోయింది. చివర్లో ఓ ముసలాయన పాత్ర చేసే ఫైట్స్ హైలైట్గా నిలిచాయి. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇలా డైరెక్ట్ పొలిటికల్ డైలాగ్లు, పొలిటికల్ కంటెంట్తో వస్తున్న ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనేది అనుమానంగా మారింది.