
రీసెంట్ గా 'హను-మాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ దర్శకుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ వెంటనే 'హనుమాన్' కి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పిన దర్శకుడు.. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంటే ముందు ప్రశాంత్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జై హనుమాన్ షూటింగ్ కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తన పాత పెండింగ్ ఉన్న చిత్రంపై ఫోకస్ పెట్టారట ప్రశాంత్. ఇప్పటికే 65 శాతం పూర్తి చేసిన ఆక్టోపస్ సినిమా షూటింగ్ను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆక్టోపస్ సినిమా పూర్తిగా మహిళా ప్రాధాన్యత చిత్రం అని తెలుస్తోంది. ఇందులో ఐదు మహిళా ప్రధాన పాత్రలు ఉంటాయని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
ఈ చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఐదుగురు మహిళలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయినప్పుడు ఏమి జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అయితే ఈ సినిమాను మొదటగా ఫిల్మ్ ఫెస్టివల్స్కు పంపించిన తర్వాత థియేటర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు తర్వాత మొదలెట్టే 'జై హనుమాన్' సినిమా కథంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో హనుమాన్ రోల్ లో ఏ హీరో నటిస్తారనే దాని గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు ప్రశాంత్ వర్మ.. ఈ గ్యాప్ లో అసంపూర్తిగా మిగిలిపోయిన 'ఆక్టోపస్' అనే సినిమాని కంప్లీట్ చేస్తున్నారు. ఇంతకు ముందు 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే సినిమా అంతా పూర్తవుతుందని చెప్తున్నారు.