
సోషల్ మీడియాతో తరచూ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంటుందన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా మహేష్, బన్నీ ఫ్యాన్స్ మధ్య, అలాగే అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య, మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. అప్పుడప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తంగా ఫ్యాన్స్ వార్ తరచూ ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. అయితే అవన్నీ సరదాగా, కాలక్షేపంగా జరుగుతూంటాయి. అక్కడ తిట్టుకున్నా లైట్ తీసుకుంటారు. కానీ ప్రాణాలు తీసుకునేదాకా పోరు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఫ్యాన్ వార్ ని నెక్ట్స్ క్రైమ్ లెవిల్ కు తీసుకెళ్లి భయబ్రాంతులను చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఫ్యాన్ వార్ తో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి... అది కాస్తా హత్యకు దారితీసింది. ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్స్ వేస్తూ ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో ఒకరు చనిపోయారు. మూడు రోజుల క్రితం పెయింటర్లు హరికుమార్, కిషోర్.. అత్తిలి వెళ్లారు. పెయింటర్ హరికుమార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్. దాంతో అతడు తన వాట్సాప్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు.
ఇక మరో పెయింటర్ కిషోర్ ఏమో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని. నేను పవన్ ఫ్యాన్ ని, నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ వీడియోని స్టేటస్ గా పెట్టుకో అని హరికుమార్ ను కోరాడు కిషోర్. దానికి హరికుమార్ ఒప్పుకోలేదు. నేను ప్రభాస్ కి వీరాభిమానిని, ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటాని తేల్చి చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దీనిపై గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది.
కోపంతో ఊగిపోయిన హరికుమార్ ...సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై బలంగా కొట్టాడు. అంతేకాదు సిమెంటు రాయితో ముఖం మీద కొట్టాడు. అంతే, తీవ్రగాయాలతో కిషోర్ స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటన తర్వాత హరికుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హరికుమార్ ను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.