
చోళ రాజ్యం నేపథ్యంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన `పొన్నియిన్ సెల్వన్` ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. ఈచిత్రానికి మిశ్రమ స్పందన లభించినా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. `బాహుబలి`తో కంపేర్ చేయడం కాస్త ఈ సినిమాకి మైనస్గా మారింది. అది పక్కన పెడితే విమర్శకుల ప్రశంసలందుకుందీ సినిమా. కలెక్షన్ల పరంగా ఏకండా ఐదు వందల కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది.
అయితే దర్శకుడు మణిరత్నం దీన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నట్టు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండో పార్ట్ అప్డేట్ వచ్చింది. `పొన్నియిన్ సెల్వన్ 2` కి సంబంధించి కీలక అప్డేట్ని ఇచ్చింది యూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. నిర్మాణ సంస్థ లైకా తాజాగా ఈ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు.
రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడితోపాటు అతడి సుకుమారులు కలికాల చోళుడు, పొన్నియిన్ సెల్వన్ జీవితాల నేపథ్యంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే పొన్నియిన్ సెల్వన్పై హత్యకి కుట్ర వరకు మొదటి భాగం పూర్తయ్యింది. మరి ఆ కుట్ర తర్వాత పొన్నియిన్ బతికాడా లేదా ఆ తర్వాత ఏమైందనే కథని రెండో భాగంలో చూపించబోతున్నారు.
ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషించగా, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శోభితా దూళిపాళ్ల ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతోపాటు మద్రాస్ స్టూడియోస్ పతాకంపై మణిరత్నం నిర్మించారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఐదేళ్ల క్రితం `బాహుబలి2` అదే డేట్కి విడుదలై సంచలనాలు క్రియేట్ చేస్తుంది. మరి అదే సెంటిమెంట్ని మణిరత్నం ఫాలో అవుతున్నారా? అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. యాదృశ్చికంగా ఆ డేట్ కుదిరిందా? కావాలని ప్లాన్ చేశారా? అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మరి ఈ డేట్ సీక్రెట్ ఏంటనేది తెలియాల్సి ఉంది.