
తమిళ హీరోయిన్ యషిక ఆనంద్ కొన్ని రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యషిక తన స్నేహితులతో కలసి పాండిచ్చేరిలో పార్టీ ముగించుకుని చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు పావని మృతి చెందింది. యషిక ఆనంద్ తీవ్ర గాయాలకు గురైంది.
ఇప్పటివరకు చెన్నైలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక ఆనంద్ కోలుకుంది. ఇటీవలే యాషిక ఆనంద్ ని జనరల్ వార్డుకు మార్చారు. ఇప్పుడు డిశ్చార్జ్ చేశారు. సహజంగా డిశ్చార్జ్ కాగానే ఎవరైనా ఇంటికి వెళతారు. కానీ యషిక మాత్రం ఓ నర్సు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళితే తన స్నేహితురాలు పావని జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయని.. అందువల్లే నర్సుగా పనిచేస్తున్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్లు యషిక తెలిపింది.
పావని మృతి పట్ల యషిక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ మధ్యన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తాను బ్రతికి ఉన్నంతకాలం గిల్టీగా ఫీల్ అవుతానని యషిక ఆవేదన వ్యక్తం చేసింది. పావని కుటుంబ సభ్యులని క్షమాపణ కూడా కోరింది. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు కూడా యషికపై వార్తలు వచ్చాయి. వాటిని యషిక ఖండించింది.
ఇక యషిక కోలుకోవడంతో పోలీసులు పని మొదలు పెట్టారు. యషికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యషిక డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే యషికని ఎంక్వైరీకి పిలవనున్నట్లు తెలుస్తోంది.'నాకు మూడు ఆపరేషన్స్ జరిగాయి. చాలావరకు నొప్పి తగ్గింది. అయినా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళితే నా స్నేహితురాలు పావని గుర్తుకు వస్తుంది. అందుకే నాకు తెలిసిన నర్సు ఇంటికి వచ్చాను' అని యషిక పేర్కొంది.
తమిళంలో యషిక బిజీ నటి. విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలో యషిక మెరిసిన సంగతి తెలిసిందే. యషిక త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.