
పెద్ద సినిమాలు రిలీజ్ అంటే చాలా చూసుకోవాలి. ఆ సినిమా రిలీజ్ ప్రకటించే ముందు తమలాంటి మరో పెద్ద సినిమా రిలీజ్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే థియోటర్స్ సమస్య వచ్చేస్తుంది. అలాగే మెగా క్యాంప్ హీరోలు అయితే తమ హీరోల సినిమాలు క్లాష్ కాకుండా చూసుకుంటారు. ఇలా అన్ని చూసుకునే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అలాగే పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ నాలుగైదు నెలల ముందే ప్రకటిస్తారు. మిగతావాళ్లు జాగ్రత్తపడతారని. ఇలా చాలా మంది తమ సినిమా రిలీజ్ డేట్స్ ఆ మధ్యన వరసపెట్టి ప్రకటించేసారు. కానీ కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. అందరి షెడ్యూల్స్ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. ఈ నేపధ్యంలో తమ రిలీజ్ డేట్ అనుకున్న స్లాట్ మాత్రం మార్చేది లేదన్నట్లుగా పవన్ నిర్మాత ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్తో చాలా సినిమాలు షూటింగ్తో పాటు విడుదల తేదీలను సైతం వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా కూడా వాయిదా పడనుందని కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి వార్తలపై ఎ.ఎం.రత్నం స్పందిస్తూ... ‘‘సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికే తెరపైకి రానుంది. దర్శకుడు క్రిష్ అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అంతేకాదు సంక్రాంతి పండగ అంటే ఇంకా చాలా సమయం ఉంది. అందువల్ల చిత్రం విడుదలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని’’ వెల్లడించారు.
17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఆ మధ్య బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ నేతృత్యంలో పవన్పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ - సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో కథానాయకుడిగా మలయాళంలో విజయవంతమైన ‘అయప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ‘పీఎస్పీకే30’ వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.