`వకీల్‌ సాబ్‌` రీ రిలీజ్‌.. ఎన్నికల మైలేజ్‌కోసం పవన్‌ సినిమా మళ్లీ విడుదల?

By Aithagoni RajuFirst Published Apr 27, 2024, 9:31 AM IST
Highlights

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` మూవీ మళ్లీ థియేటర్లోకి రాబోతుంది. ఈ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ మళ్లీ థియేటర్లోకి రావడం ఆసక్తికరంగా మారింది. 
 

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించాల్సిన మూడు సినిమాలను పక్కనపెట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున ఆయన ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. జోరుగా ఆయన ప్రచారం జరుగుతుంది. టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పవన్‌. 

ఇదిలా ఉంటే తాజాగా ఆయన సినిమా మళ్లీ రిలీజ్‌ కాబోతుంది. పవన్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` మూడేళ్ల క్రితం వచ్చి మంచి విజయం సాధించింది. బాలీవుడ్‌లో వచ్చిన `పింక్‌` చిత్రానికిది రీమేక్‌. ముగ్గురు అమ్మాయిలను దుండగులు వేధించిన కేసుకి సంబంధించిన కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రాజకీయ నాయకుడి కొడుకు ఆ అమ్మాయిలపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తుంటారు. ఆ కేసుని హీరో వాదిస్తాడు. ఎలా వాదించాడు, కోర్టు లో నాయకుడి కొడుకుని ఎలా దోషిగా నిలబెట్టాడనేది ఈ మూవీ కథ. 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా చేసిన ఈ చిత్రంలో ముగ్గురు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల నటించారు. పవన్‌కి జోడీగా శృతి హాసన్‌ కనిపించింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్‌ 9న విడుదలైంది. కరోనా సమయంలోనూ పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాని రీ రిలీజ్‌చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. 

మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు. అయితే ఏపిలో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది పవన్ కి ఎన్నికల పరంగా పాజిటివ్‌ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో ఆయనకు మైలేజీని తీసుకొస్తుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ డౌన్‌ అయ్యింది. థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఒకటి అర అరుదుగా అలరిస్తున్నాయి, తప్ప పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. పైగా ఇప్పుడు ఎన్నికల సీజన్‌ కావడంతో ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక పవన్‌ కళ్యాణ్‌ నటించాల్సిన చిత్రాల్లో `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్ సింగ్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాలున్నాయి. ఇందులో సుజీత్‌ రూపొందిస్తున్న `ఓజీ`లో పవన్‌ ఇరవై రోజులు షూటింగ్‌లో పాల్గొంటే సినిమా అయిపోతుంది. దీన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ రూపొందిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్‌` మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు పవన్‌. చివరగా `హరిహరవీరమల్లు` చిత్రీకరణలో పాల్గొంటాడని సమాచారం. 

click me!