
లేటు వయసులో ఘాటు ప్రేమతో ఒక రేంజ్ లో వివాదం సృష్టించిన జంట నరేష్, పవిత్ర. ఎవరెన్ని విమర్శలు చేసినా తమ రిలేషన్ ని నరేష్, పవిత్ర ఇంకా బలపరుచుకుంటున్నారు. నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతితో విడిపోయి.. పవిత్రతో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలసి జీవిస్తూ ప్రేమలో మునిగితేలుతున్నారు.
తమ రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో, ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకుంటూ ఈ జంట మళ్ళి పెళ్లి అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం, లేటు వయసులో వరుస పెళ్లిళ్ల కారణంగా ఈ జంటపై ట్రోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా పవిత్ర లోకేష్ తన మాతృ భాష కన్నడపై మాత్రం మమకారం కోల్పోలేదు.
కన్నడ సాహిత్యంలో పవిత్ర పీ హెచ్ డి చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితం నరేష్.. పవిత్రని బళ్లారి తీసుకువెళ్లి అక్కడ హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాయించారు. దగ్గరుండి తన పార్ట్నర్ ని నరేష్ పరీక్ష రాయించడం విశేషం. ఇప్పుడు ఆ ప్రవేశ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. మొత్తంగా పవిత్ర తన ప్రియుడు నరేష్ గర్వపడేలా చేసింది, ఆమె పీ హెచ్ డి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించింది. 981 మంది ఈ ప్రవేశ పరీక్ష రాయగా పవిత్ర తో పాటు 259 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ మేరకు హంపి కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రకటన విడుదల చేశారు. తాజాగా విడుదలైన రిజల్ట్ తో నరేష్, పవిత్ర ఇద్దరూ సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో ఆమెకి తప్పకుండా సీటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్ని వివాదాలు ఎదురైనా నరేష్, పవిత్ర వృత్తి పరంగా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వారికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్యన నరేష్ సామజవరగమన చిత్రంలో హీరో తండ్రిగా అదరగొట్టారు.
పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. పెళ్లిపై తమకు గౌరవం ఉందని.. కానీ ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది అని కామెంట్స్ చేసారు. చేసుకోవాలనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాం అని గతంలో నరేష్ అన్నారు.