
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `పలాస 1978`. ఈ సినిమా 2020లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. క్రిటికల్గా ప్రశంసలందుకుంది. జాతీయ స్థాయిలో గౌరవాలను పొందింది. తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికైంది. చెన్నైలో ఈ నెల 9, 10,11 లలో p.k.rose ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట జరగబోయే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోయే సినిమాలలో `పలాస 1978` ఎంపిక కావడం విశేషం.
ఈ సందర్భంగా దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూ, దళిత జీవనాన్ని, దళిత జీవిత కథా చిత్రాన్ని కథా వస్తువులుగా తీసుకునే పా రంజిత్ 2018 లో `వానమ్ ఆర్ట్ ఫెస్టివల్` ని ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ జరగబోతుంది. ఏప్రిల్ నెలను దళిత్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ మహాశయుని పుట్టిన రోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం , సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి.
దళిత పాలిటిక్స్ ని ఇతివృత్తంగా చేసుకొని చేసిన సినిమాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమా ల పక్కన `పలాస 1978` సినిమాకు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఫెస్టివల్ లో భాగం అయినందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేస్తే దాన్ని భుజాన వేసుకొనే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు అని పలాసతో నాకు అనుభవంలోకి వచ్చింది. దానితో పాటు ఇటువంటి వేదిక ల మీద `పలాస 1978` సినిమా ప్రదర్శించడం దర్శకుడుగా మరిచిపోలేని అనుభవం కాబోతుంది` అని తెలిపారు కరుణ కుమార్.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి, దర్శకుడు కరుణ కుమార్ గురించి యూనిట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `సినిమా అనే మాట వినోదానికి పర్యాయపదంగా మారిన రోజుల్లో ఆ వినోదంతో పాటు సామాజిక స్పృహ కలిగిన సినిమాలను అందించే దర్శకులు అరుదుగా ఉంటారు. తెలుగులో ఆ జాబితాలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కరుణ కుమార్. ఆయన రూపొందించిన `పలాస1978` మేకర్స్ కి రిఫరెన్స్ సినిమాగా మారింది. భారతీయ సినిమా తెరమీద సామాజిక బాధ్యత గల సినిమాలతో తమదైన ముద్రను వేస్తున్న దర్శకులు నీరజ్ ఘావన్, నాగరాజ్ ముంజలే, వెట్రిమారన్, పా రంజిత్ సరసన తెలుగు నుండి కరుణ్ కుమార్ పేరు చేరింది.
దళిత పాలిటిక్స్ బేస్ చేసుకొని నిర్మించిన సినిమాలను ఎంపిక చేసి వానమ్ ఆర్ట్స్ ఫెస్టివల్ ని నీలమ్ ఆర్ట్స్ కల్చరల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దర్శకులు పా రంజిత్. సామాజిక స్పృ హతో దళితులకు రాజ్యాధికారం అనే అంశం ను ఇతి వృత్తంగా తీసుకొని సామాజిక చైతన్యం కలిగించిన సినిమా లు ఏ బాషలోనైనా అరుదుగా వస్తాయి. ఒక కథా వస్తువును తీసుకునేందుకు దర్శకుడు పడే తపన కచ్చితంగా అతని వ్యక్తిత్వం లోంచి వస్తుంది. అందుకే పలాస `1978` రిలీజ్ అయి రెండేళ్లు అయినా ఇప్పటికీ సినిమా ప్రపంచంలో చర్చా వస్తువుగానే ఉంది. టి.కృష్ణ, ఆర్. నారాయణ మూర్తి వంటి సామాజిక బాధ్యత తో సినిమాలు తీసే దర్శకులు తర్వాత తెలుగులో కరుణ కుమార్ పేరు ఆ వరసలో ముందుకు వస్తుంది` అని తెలిపింది.