
కోల్ కతా : బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం బుధవారం రాత్రి కోల్ కతా పార్క్ స్ట్రీట్ లోని భగీరథ నియోతియాలో చేరారు. సిజేరియన్ అయిందనీ, తల్లీ బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారని బెంగాలీ నటుడు, నుస్రత్ స్నేహితుడు యష్ దాస్ గుప్తా ప్రకటించారు.
దీంతో నుస్రత్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అభిమానులు, రాజకీయ మిత్రులు ఆమెకు అభినందనలు అందజేస్తున్నారు. జూన్ లో తన బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను, స్నేహితుల శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన నుస్రత్ గురువారం ఉదయం కూడా ఆమెను హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బాయ్ ఫ్రెండ్ గా భావిస్తున్న దాస్ గుప్తానే స్వయంగా దగ్గరుండి హాస్పిటల్ కు తీసుకువెళ్లడని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు తమ మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ అంటూ.. తల్లీ బిద్దలిద్దరికీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ భర్త నిఖిల్.. బాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
నిఖిల్ జైన్ తో రెండేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న నుస్రత్ 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా గతేడాది నవంబర్ నుంచి నుస్రత్, నిఖిల్ విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
కాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి నుస్రత్ జహాన్ పెళ్లికి సంబంధించిన వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. దీనిమీద ఇప్పుడు, బిజెపి ఎంపి సంఘమిత్ర మౌర్య లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.. ‘‘నుస్రత్ జహాన్ చట్టవిరుద్ధమైన, నైతిక ప్రవర్తన’’పై ఎథిక్స్ కమిటీతో వివరాణాత్మక దర్యాప్తు చేయించాలని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు ఆమె సభ సభ్యత్వాన్ని "నాన్-ఎస్టేట్" గా మౌర్య అభివర్ణించారు. జూన్19న మౌర్య స్పీకర్కు లేఖ రాశారు. సంఘమిత్ర మౌర్య ఉత్తరప్రదేశ్లోని బడాన్ నుంచి బిజెపి ఎంపిగా ఎంపికయ్యారు. ఈ లేఖతో పాటు ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి లోక్సభ ప్రొఫైల్ను కూడా అటాచ్ చేశారు. ఈ ప్రొఫైల్ లో ఆమె తన భర్త పేరు నిఖిల్ జైన్ అని పేర్కొన్నట్టుగా ఉంది.
"లోక్ సభ నిబంధనల ప్రకారం నుస్రత్ మీద తగిన చర్యను తీసుకోవాలని, ఆమె చట్టవిరుద్ధమైన, నైతిక ప్రవర్తనకు సంబంధించిన వివరణాత్మక దర్యాప్తు కోసం ఎథిక్స్ కమిటీకి పంపాలి" అని మౌర్య లేఖలో పేర్కొన్నారు. "" ఆమె వివాహానికి సంబంధించి, మీడియాలో చేసిన ప్రకటన లోక్ సభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆమె నుస్రత్ జహాన్ రుహి జైన్ గా ప్రమాణ స్వీకారం చేయడం, రెండూ విరుద్ధంగా ఉన్నాయని, ఇది ఆమె సభ్యత్వాన్ని చట్టవిరుద్ధం అని నిరూపిస్తుంది"అని లేఖలో పేర్కొన్నారు.
జూన్ 25, 2019న తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జహాన్ తన పేరును నుస్రత్ జహాన్ రుహి జైన్ అని తెలిపారని, ఆ సమయంలో ఆమె కొత్తపెళ్లికూతురిలాగే దుస్తులు ధరించిందని మౌర్య తన లేఖలో పేర్కొన్నారు. "వాస్తవానికి, ముస్లిమేతరులను వివాహం చేసుకున్నందుకు, సిందూర్ ధరించినందుకు ఇస్లాంవాదులలో ఒక వర్గం ఆమెపై దాడి చేసినప్పుడు, పార్టీ శ్రేణుల్లోని ఎంపీలు ఆమెను సమర్థించారు. మీడియా రిపోర్టుల ప్రకారం ఆమె రిసెప్షన్కు సిఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు" అని బిజెపి ఎంపి రాశారు.
జహాన్ వ్యక్తిగత జీవితంలో ఏమైనా చేసుకోవచ్చు, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. కాకపోతే ఆమె ఇటీవల మీడియా ముందు చేసిన కొన్ని వ్యాఖ్యలతో ‘నుస్రత్ ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటులో తప్పుడు సమాచారాన్ని అందించింది", "ఆమె ఉద్దేశపూర్వకంగానే లోక్సభ సచివాలయానికి తప్పుడు సమాచారాన్ని అందించింది, తద్వారా అనైతిక, చట్టవిరుద్ధమైన ప్రవర్తనకు పాల్పడింది. తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఆమె తన ఓటర్లను మోసం చేసింది. ఇది పార్లమెంటుకు, అందులోని సభ్యులకు చెడ్డ పేరు తెస్తుంది" అని మౌర్య ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు జే ప్రకాష్ మజుందార్ ఈ నెల మొదట్లో జహాన్ పెళ్లికి సంబంధించి "పరస్పర భిన్నమైన" వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. చట్టం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. "ఇది చాలా పెద్ద విషయం అని, ఆమె పార్లమెంటు సభ్యురాలు. చట్టసభ సభ్యురాలు అయినా ఆమె నిబంధనలను పాటించడం లేదు. చట్టం దీనిమీద చర్యలు తీసుకోవాలి. పార్లమెంటు సభ్యత్వం లేఖలో కూడా ఆమె పెళ్లి అయినట్టుగా ప్రకటించింది "అని మజుందార్ చెప్పారు.
వ్యాపారవేత్త నిఖిల్ జైన్ నుండి ఆమె విడిపోవడం గురించి నుస్రత్ జహాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు, ఇందులో తన "పెళ్లి" భారత చట్టం ప్రకారం చెల్లుబాటు కానందున విడాకుల ప్రశ్న తలెత్తదని ఆమె అన్నారు. టర్కీ వివాహ నిబంధన ప్రకారం టర్కీలోని విదేశీయులను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ వివాహం చట్టబద్ధంగా చెల్లదని నుస్రత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
"ఇది ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్... కాబట్టి, భారత్ లో ప్రత్యేక వివాహ చట్టం క్రింద ధ్రువీకరణ అవసరం, అది జరగలేదు. న్యాయస్థానం ప్రకారం, ఇది వివాహం కాదు, సంబంధం, సహజీవనం.. అందుకే ఇందులో విడాకుల ప్రశ్న తలెత్తదు" అని ఆమె చెప్పారు.