తలవంచి నా మన్నింపుని కోరుతున్నా.. అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు..

By Aithagoni RajuFirst Published Sep 2, 2022, 10:44 PM IST
Highlights

`బ్రహ్మాస్త్ర` ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. 

ఎన్టీఆర్‌(NTR) తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. `బ్రహ్మాస్త్ర` (Brahmastra) ఈవెంట్‌ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయిన నేపథ్యంలో క్యాన్సిల్ కి గల కారణాలు తెలియజేస్తూ సారీ చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో `బ్రహ్మాస్త్ర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని భావించగా, చివరి నిమిషంలో పోలీసులు ఈ ఈవెంట్‌కి అనుమతివ్వలేదు. దీంతో అప్పటికప్పుడు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్‌లో ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. 

`ముందుగా నేను నా అభిమానులకు క్షమాపణలు తెలియజేయాలి. ఎంతో ఆర్భాటంగా `బ్రహ్మాస్త్ర` ఈవెంట్‌ని చేయాలనుకున్నారు. కానీ వినాయక చవితి ఉండటం వల్ల పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఎక్కువగా ఇవ్వలేమని, ఈవెంట్‌ని కంట్రోల్‌ చేయడం కష్టమనే ఉద్దేశంతో పోలీసులు పర్మిషన్‌ ఇవ్వలేదు. వాళ్లు ఉండేది, చేసేది మన భద్రత కోసం కాబట్టి వాళ్లు చెప్పే మాట వినడం ఈ దేశ పౌరుడిగా మన ధర్మం. అందుకు మేం కూడా వాళ్లకి సహకరించి ఈ రోజు ఇలా ఏర్పాటు చేయించాం` అని తెలిపారు ఎన్టీఆర్‌. 

ఆయన ఇంకా చెబుతూ, ఈ ఈవెంట్‌ కి వచ్చిన, వద్దామనుకున్న అభిమానులకు అందరికి తలవంచి నా మన్నింపుని కోరుకుంటున్నా. ఈవెంట్‌కి రాకపోయినా మీరు మంచి సినిమాని ఆశీర్వదిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాకి కూడా క్షమాపణలు తెలియజేశారు తారక్‌.  రణ్‌ బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన `బ్రహ్మాస్త్ర`లో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. 

click me!