
రాజమౌళి రూపొందించిన అద్భుత కళాఖండం `ఆర్ఆర్ఆర్` మరో మైలు రాయిని చేరుకుంది. ఈ చిత్రం వెయ్యికోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. `బాహుబలి` తర్వాత వెయ్యి కోట్లు సాధించిన తెలుగు సినిమాగా `ఆర్ఆర్ఆర్` నిలిచింది. అలాగే `బాహుబలి`, `దంగల్` చిత్రాల తర్వాత వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. దాదాపు 16 రోజులకుగానూ ఈ సినిమా ఈ రేర్ మైల్ స్టోన్ని రీచ్ అయ్యింది.
ఈ చిత్రం తెలుగులోనే దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఓవర్సీస్లో రెండు వందల కోట్లు, బాలీవుడ్లో రెండు వందల కోట్లు, సౌత్లో సుమారు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లు సాధించింది. `బాహుబలి`ని కూడా మించిపోయిందని తెలుస్తుంది. అయితే భారీ స్థాయిలో రిలీజ్, మూడు వారాల పాటు మరో సినిమా లేకపోవడం, భారీగా పెరిగిన టికెట్ రేట్లు, ఐదు షోలు వంటి కారణాలతో ఈ చిత్రం ఈ స్థాయి కలెక్షన్లని రాబట్టిందని ట్రేడ్ వర్గాల టాక్. ఎందుకంటే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని, అసలు కథే లేదని, కేవలం కొని ఎపిసోడ్ల మీదనే సినిమా రన్ అవుతుందనే టాక్ ఇప్పటికీ వినిపిస్తుంది.
హీరోల ఇంట్రడక్షన్ ఎపిసోడ్లు, ఇంటర్వెల్కి ముందు వచ్చే రామ్చరణ్, ఎన్టీఆర్ ల ఫైట్, క్లైమాక్స్, ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్లు మాత్రమే సినిమాలో హైలైట్గా ఉన్నాయి. పాప సెంటిమెంట్ ఆకట్టుకునే అంశం. ఈ ఎపిసోడ్లే సినిమాని నిలబెట్టాయి. బ్లాక్బస్టర్ హిట్గా నిలిపాయి. దాదాపు నాలుగువందల యాభై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా దానికి డబుల్ కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఇందులో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించగా, అలియాభట్, ఒలివీయా మోర్రీస్ కథానాయికలుగా, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించారు.
అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కంటే రామ్చరణ్ పాత్ర హైలైట్ అయ్యిందని, ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుందని, కేవలం ఎన్టీఆర్ నటించిన కొమురంభీమ్ కీ రోల్ మాత్రమే అనే కామెంట్లు వినిపించాయి. సినిమాలో వారి పాత్రల నిడివిలో, ప్రాధాన్యతలోనూ ఆ తేడా ఉండటంతో తారక్ ఫ్యాన్స్ పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారని తెలుస్తుంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.