జూ. ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సహం.. 9 మంది అరెస్ట్.. ఇంతకీ వారు ఏం చేశారంటే..

By Sumanth KanukulaFirst Published May 23, 2023, 9:23 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానుల అత్యుత్సాహం అరెస్ట్‌లకు దారితీసింది. 9 మంది ఎన్టీఆర్ అభిమానులను రాబర్ట్‌సన్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

విజయవాడ: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానుల అత్యుత్సాహం అరెస్ట్‌లకు దారితీసింది. 9 మంది ఎన్టీఆర్ అభిమానులను రాబర్ట్‌సన్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చెమ్మనగిరిపేటలోని సిరి వెంకట్, సిరి కృష్ణ థియేటర్‌ వద్ద రెండు మేకలను వధించి, వాటి రక్తాన్ని అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ బ్యానర్‌లపై చిందించారు. ఈ ఘటనకు సంబంధింన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చర్యలు చేపట్టారు. 

గుడ్లవల్లేరుకు చెందిన శివనాగరాజు పోతుమూడితో పాటు అతని స్నేహితులు సాయి కుంభం, సాయి గంజల, నాగ భూషణం దావు, సాయి వక్కలగడ్డ, నాగేశ్వరరావు పల్లపు, ధరణి యేలికట్ల, శివ పరసా, అనిల్ కుమార్ బొల్లాలపై కేసు నమోదు చేశారు. వీరు మే 20న జూనియర్ ఎన్టీఆర్ 40వ జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానుల కోసం రీ-రిలీజ్ అయిన సింహాద్రి చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సిరి వెంకట్, సిరికృష్ణ థియేటర్ వద్దకు చేరుకుని.. రెండు మేకలను శిరచ్ఛేదం చేసి వాటిని పైకి లేపి ఫ్లెక్సీ బ్యానర్లపై రక్తాన్ని చిందించారు.

ఈ సమయంలో అక్కడే ఉన్న పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. అనంతరం శివనాగరాజు, అతడి అనుచరులు మేకలను చంపిన పదునైన ఆయుధాలతో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సోమవారం పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

click me!