ఆమెతో ఫోటోలు దిగిన అమీర్ నెటిజన్స్ కి అడ్డంగా దొరికిపోయారు..!

By Satish ReddyFirst Published Aug 17, 2020, 2:56 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం అమీర్ ఖాన్ టర్కీ ప్రధమ మహిళతో ఫోటోలు దిగడమే. ఆమెతో ఫోటోలు దిగితే నెటిజెన్స్ కి కోపం ఎందుకు వచ్చిందో తెలియాలంటే మీరు ఇది చదవాల్సిందే. 

బాలీవుడ్ స్టార్ హీరోలలో అమీర్ ఖాన్ కి వివాదరహితుడిగా పేరుంది. మిగతా హీరోలతో పోల్చుకుంటే ఆయన విమర్శల పాలైన సందర్భాలు చాలా అరుదు. ఈ జెంటిల్ మెన్ ఎంచుకొనే సినిమా సబ్జక్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. గత కొంత కాలంగా ఖాన్ త్రయంలో అమీర్ ఖాన్ దే హవా. ఆయన నటించిన 3 ఇడియట్స్, పీకే, దంగల్ బాక్సాపీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది. ఇక దంగల్ మూవీ చైనాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు.ఐతే మనం ఎంత వివాదాలకు దూరంగా ఉండాలన్నా, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వాటిలో చిక్కుకుంటాం. 

ఇప్పుడు అమీర్ ఖాన్ పరిస్థితి అలాగే తయారైంది. తాజాగా అమీర్ చేసిన ఓ పని నెటిజెన్స్ ఆగ్రహానికి గురైంది. విషయంలోకి వెళితే అమీర్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం ఆయన టర్కీ దేశం వెళ్లారు. అక్కడ ఇస్తాంబుల్ నగరంలో షూటింగ్ నిర్వహిచడం జరిగింది. పనిలో పనిగా అమీర్ ఆ దేశ అధ్యకుడి సతీమణి , టర్కీ మొదటి మహిళ అయిన ఎమిన్ ఎర్డోగాన్ ని కలిశారు. ఆమెతో ఫోటోలకు పోజిచ్చారు. అమిర్ ఖాన్ తో దిగిన ఫోటోలను ఎమిన్ ఎర్డోగాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే అమీర్ ని కలవడం చాలా ఆనందాన్ని కలిగించిందని, లాల్ సింగ్ చద్దా మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాని చెప్పడం జరిగింది. 

ఈ విషయం ఇండియన్స్ కోపానికి కారణం అయ్యింది. భారత ప్రభుత్వం ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఆ విషయంలో టర్కీ మన శత్రు దేశం పాకిస్థాన్ కి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో శత్రు దేశానికి మద్దతు తెలిపిన దేశ ప్రధమ మహిళతో మీరు ఫోటోలు ఎలా దిగుతారని వారు ప్రశ్నిస్తున్నారు . అలాగే మీకు దేశభక్తి లేదా అని నిలదీస్తున్నారు. ఊహించన ఈ పరిణామంతో అమీర్ కి ఏమి చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు. 
 

click me!