నాగచైతన్య గత సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ నిర్మాతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చైతూ కొత్త సినిమాకి సంబంధించిన బడ్జెట్ లెక్కలు ఇప్పుడు షాకిస్తున్నాయి.
నాగ చైతన్య గత సినిమా `కస్టడీ` డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఘోరంగా పరాజయం చెందింది. గతేడాది విడుదలైన ఈ సినిమాకి సుమారు 40-50కోట్ల వరకు పెట్టారట. బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ కనీసం పది కోట్ల షేర్ కూడా రాలేదు. పైగా వరుసగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంతకు ముందు వచ్చిన `థ్యాంక్యూ` సైతం డిజాస్టర్.
ఇలాంటి పరిస్థితుల్లో నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటారు మేకర్స్. కానీ నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ విషయంలో అస్సలు తగ్గడం లేదు నిర్మాతలు. అంతేకాదు భారీ బడ్జెట్ తో మూవీ చేస్తున్నారు. మార్కెట్ని మించి బడ్జెట్ పెడుతున్నారట. తాజాగా `తండేల్` మూవీకి సంబంధించిన బడ్జెట్ విషయాలు బయటకు వచ్చాయి. సినిమా బడ్జెట్కి సంబంధించిన లెక్కలు షాకిస్తున్నాయి.
`తండేల్` సినిమాని సుమారు రూ.75కోట్లతో నిర్మిస్తున్నారట. ఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు లీక్ చేశారు. సినిమా కథ డిమాండ్ చేస్తుందని, దీంతో తగ్గడం లేదని తెలుస్తుంది. కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే జాలర్ల జీవితాల నేపథ్యంలో అక్కడి ఓ కుర్రాడి ప్రేమ కథ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
ఇందులో నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుంది. `లవ్ స్టోరీ` తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసినటిస్తున్నారు. చందూమొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. చివరగా ఆయన రూపొందించిన `కార్తికేయ 2` మూవీ వంద కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ కాంబోలో మూవీ కావడంతో నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో రాజీపడటం లేదట. వీరున్నారనే ధైర్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది.
దీనికితోడు ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే బిజినెస్ కూడా జరిగింది. డిజిటల్ రైట్స్ రూపంలోనే ఇప్పటికే నలభై కోట్లు వచ్చిందని అంటున్నారు. థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో నలభై వస్తే నిర్మాతలు సేఫ్. కానీ థియేటర్లలో ఈ మూవీ దాదాపు 80-90కోట్లు వసూలు చేయాలి. మరి ఈ రేంజ్లో ఇది ఆకట్టుకుంటుంది? ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.