వీరసైనికుడు ప్రవీణ్ కుమార్ మరణంతో ప్రభుత్వం కొంత మేరకు సహాయం చేసింది. అంతకు మించి ఏ సహాయం వీరికి అందలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న మోహన్బాబు స్పందించారు.
భారత సైన్యంలో వీర మరణం పొందిన హవల్దార్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి కలెక్షన్ కింగ్ మోహన్బాబు అండగా నిలిచారు. గతేడాది నవంబర్లో శ్రీనగర్ 18వ రెజిమెంట్లో విధులు నిర్వర్తిస్తుండగా ఉగ్రవాదులతో జరిగిన ఎదురుదాడిలో ప్రవీణ్ మరణించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన ఆయనకు భార్య రజిత, ఓ కుమారుడు, ఓ కుమార్తో ఉన్నారు. ప్రవీణ్ మరణంతో ప్రభుత్వం కొంత మేరకు సహాయం చేసింది. అంతకు మించి ఏ సహాయం వీరికి అందలేదు.
ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న మోహన్బాబు స్పందించారు. ప్రవీణ్ కుమార్ కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధిరాకి కల్నల్ ఓఎల్వీ నరేష్, కమాండింగ్ ఆఫీసర్ లు స్వయంగా మోహన్బాబుకి లేఖ రాసి ఆదుకోవాలని కోరడంతో మోహన్బాబు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రవీణ్ కుమార్ కుమార్తె లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుండి ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ భార్య మంచు ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.
`సరిహద్దుల్లో శత్రు సైన్యాల నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. వారిని ఆదుకోవడం, అండగా నిలవడం ప్రతి భారతీయుడి బాధ్యత` అని విష్ణు అన్నారు. మోహన్బాబు ప్రస్తుతం `సన్నాఫ్ ఇండియా` చిత్రంలో నటిస్తున్నారు.