ఢిల్లీకి పయనమైన చిరంజీవి...రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ ప్రదానం!

By Sambi ReddyFirst Published May 8, 2024, 6:49 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో గౌరవం చేరింది. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ వేదికగా అవార్డు అందుకోనున్నారు. 
 

నాలుగు దశాబ్దాలు పైగా చిరంజీవి చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో చిరంజీవి ఒకరు. నటుడిగా వినోదం పంచుతూనే సామాజికవేత్తగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఏర్పాటు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. చిరంజీవి సేవలకు గాను భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ చే గౌరవించింది. 

ఈ ఏడాదికి గాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా... చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. మే 9 గురువారం చిరంజీవి ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన సైతం ఢిల్లీ వెళుతున్నారు. ఈ క్రమంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇక ఏడుపదుల వయసులో కూడా చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. గత రెండేళ్లలో చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల చేశారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. నెక్స్ట్ ఆయన విశ్వంభర మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్ర దర్శకుడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. 

చిరంజీవి జంటగా త్రిష నటిస్తుంది. ఈషా చావ్లా, సురభి వంటి యంగ్ హీరోయిన్స్ సైతం జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం చిరంజీవి రియల్ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం. కఠిన యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా డూప్ లేకుండా నటిస్తున్నాడట. విశ్వంభర చిత్రంపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. 

click me!