
సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యనే తెలుగు దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరీ కన్నుమూశారు. ఒక నిర్మాత మరణించారు. అలాగే బాలీవుడ్లో కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించిన వార్త ఇంకా మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ప్రియాంక కజిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ముంబైలో భార్య కమిని, కూతుళ్ళు మన్నారా, మిథాలితో కలిసి ఉండేవారు. మన్నారా తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ 17 లో కూడా పాల్గొన్నారు.
మన్నారా చోప్రా తండ్రి రామన్ హండా ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల పిన్ని కమిని చోప్రాను వివాహం చేసుకున్నారు. తండ్రి మరణవార్తను మన్నారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తండ్రి ఫోటో షేర్ చేస్తూ నివాళులు అర్పించారు. జూన్ 16, 2025న తండ్రి మరణించారని, జూన్ 18న అంబోలి, అంధేరీ వెస్ట్ లో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
మన్నారా చోప్రా.. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు సినిమా 'ప్రేమ గీమా జంత నై' ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. `జక్కన్న`, `తిక్క`, `రోగ్`, `సీత`, `హై ఫౌవ్ః ఫన్ అండ్ గన్`, `తిరగబడరా సామీ` వంటి చిత్రాల్లో నటించింది.
ఇక 'జిద్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టినా అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ నటిగా స్టార్ స్టేటస్ని తెచ్చుకోలేకపోయింది. ఆ మధ్య హిందీలో బిగ్ బాస్ 17 షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది మన్నారా.
ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత ఇండియన్ మూవీ చేస్తోంది. అదే సమయంలో తెలుగులో మొదటిసారి కలిసి నటిస్తుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో `ఎస్ఎస్ఎంబీ29` వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో ప్రియాంక నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంటర్నేషనల్ మూవీ రేంజ్లో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి.