మోహన్‌బాబు ఇంట్లో విషాదం.. గుండెపోటుతో తమ్ముడు రంగస్వామి నాయుడు కన్నుమూత

By Aithagoni RajuFirst Published Nov 17, 2021, 6:42 PM IST
Highlights

మంచు మోహన్‌బాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు కన్నుమూశారు. గుండెపోటుకి గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు రంగస్వామి నాయుడు(63) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుదవారం సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. దీంతో మోహన్‌బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

రంగస్వామి అన్నయ్య మంచు మోహన్‌బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, ఎడ్యూకేషనలిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. రంగస్వామి తిరుపతిలో నివసిస్తున్నారు. ఆయన రైతుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో చాలా ఏళ్లుగా మోహన్‌బాబు,అతని ఫ్యామిలీ నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో అన్ని పనులను చూసుకుంటున్నారట. ఆయనకు భార్య కాంతమ్మ ఉన్నారు. రంగస్వామి నాయుడు మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, రైతులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు(గురువారం) తిరుపతిలో రంగస్వామి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

మంచు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు విష్ణు ఇటీవల `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. హోరా హోరిగా సాగిన ఈ ఎన్నికల్లో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. ఇక ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించి తెలుగులో చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎదిగారు మోహన్‌బాబు. ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ హీరోలుగా రాణిస్తున్నారు. కూతురు మంచు లక్ష్మీ నటిగా, హోస్ట్ గా, నిర్మాతగా రాణిస్తుంది. 

click me!