
మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ సినిమా చేసి చాలా కాలమే అవుతోంది. కానీ పర్సనల్ లైఫ్ తో మనోజ్ మీడియాలో, సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు. ఆ మధ్యన మంచు మనోజ్ భూమా మౌనికని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
మంచు మనోజ్ వెండితెరపై కనిపించి దాదాపు ఐదేళ్లు అవుతోంది. అహం బ్రహ్మాస్మి, వాట్ ది ఫిష్ లాంటి చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. అయితే ఆ చిత్రాలు ఎప్పుడు వస్తాయి అనే అప్డేట్ లేదు. కానీ మంచు మనోజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశ్వసనీయ సమాచారం మేరకు మంచు మనోజ్ త్వరలో ఓ టాక్ షోకి హోస్ట్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఓటిటి వేదికలపై టాక్ షో లకు అదిరిపోయే డిమాండ్ ఉంది. బాలకృష్ణ, సమంత, రానా దగ్గుబాటి లాంటి స్టార్లు ఇప్పటికే ఓటిటి వేదికపై హోస్ట్ లుగా చేశారు. వీరి బాటలోనే మంచు మనోజ్ పయనించబోతున్నట్లు తెలుస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే మంచు మనోజ్ హోస్ట్ గా చేసే టాక్ షోని 'బ్రో' చిత్ర నిర్మాతలు నిర్మించబోతున్నారట. బ్రో నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ టాక్ షో కోసం ప్లానింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఓ ఓటిటి వేదికపై ఈ టాక్ షోని స్ట్రీమింగ్ చేసే సన్నాహకాల్లో ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టాక్ షో టైటిల్ ఏంటి.. ఇతర వివరాలు, అధికారికంగా త్వరలో వెలువడనున్నాయి.
మంచు మనోజ్ రెండో వివాహంతో ఇటీవల కొత్త జీవితాన్ని ప్రారంభించారు. భూమా మౌనికతో కొంత కాలం ప్రేమ తర్వాత మనోజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన సోదరుడు మంచు మనోజ్ తో విభేదాలు కూడా తెరపైకి వచ్చాయి.