యాక్టింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన మంచు మనోజ్..ఎందుకో..

First Published Jun 14, 2017, 4:46 PM IST
Highlights
  • యాక్టింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన మంచు మనోజ్
  • విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన మనోజ్
  • ప్రస్థుతం ఒక్కడు మిగిలాడు సినిమాలో నటిస్తున్న మంచు మనోజ్

కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు కుమారుడు మంచు మనోజ్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో చేసిన ఒక్క ప్రకటనతో సంచలనానికి తెర లేపాడు. ప్రస్తుతం నటిస్తున్న ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మరొక్క చిత్రంలో మాత్రమే తాను నటిస్తున్నానని మనోజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంపై సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆ సినిమా తర్వాత నటనకు గుడ్ బై చెబుతున్నట్లు మంచు మనోజ్ ప్రకటించాడు. దీంతో అకస్మాత్తుగా మనోజ్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడనే చర్చ సాగుతోంది. 1993లో ఎన్టీఆర్, మోహన్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాతో మనోజ్ బాల నటుడిగా పరిచయమయ్యాడు. ఆ చిత్రంతో కలిపి ఒక్కడు మిగిలాడు సినిమా వరకూ మనోజ్ మొత్తం 22 చిత్రాల్లో నటించాడు. వీటిలో పోటుగాడు, బిందాస్, ప్రయాణం, వేదం సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 

నటనకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పాడు కానీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడో ప్రకటించలేదు. మంచు మనోజ్ ప్రకటనతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మరిన్ని సినిమాలు తీయాలని కోరుతున్నారు. అయితే మంచు మనోజ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య మనోజ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీంతో ఇక హీరోగా కాకుండా నిర్మాతగా రాణించాలని మనోజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సొంత ప్రొడక్షన్ సంస్థలో బడా హీరోలతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంచు మనోజ్ స్పష్టమైన ప్రకటన చేసే వరకూ ఇలాంటి ఊహాగానాలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉంటాయని సినీ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

 

ప్రస్థుతం మాత్రం మంచు మనోజ్ ట్విటర్ లో, ఫేస్‌బుక్‌లో తన పోస్ట్‌ను తొలగించాడు. దీంతో ఇంతలోనే ఏమైందోనని సినీ జనం చర్చించుకుంటున్నారు. మరి మంచు మనోజ్ నిర్ణయం వెనుక కారణం ఏంటా అనేది తేలాల్సి ఉంది.

click me!