బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `భైరవం`. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధా మోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు.
యాక్షన్ అంశాలతో సాగే ఈ కమర్షియల్ మూవీ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే గూస్బంమ్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ని గమనిస్తే ఆ గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అయిన పవిత్ర వారాహి ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రాష్ట్ర ఎండోన్మెంట్ మంత్రికి ఆ ఆలయం భూములపై కన్నేస్తాడు.
వాటిని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగించాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రామ శాంతి భంగం అవుతుంది. అప్పుడు ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ కలసి, ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. వారి మధ్య ఉన్న బంధం, ధైర్యం గ్రామ ప్రజలకు ఆశను నింపుతుంది.
అయితే ఈ దేవాలయాన్నికాపాడే క్రమంలో శత్రువు ప్లాన్లో ఈ ముగ్గురు స్నేహితులు ఇరుక్కున్నట్టు, ఎంతో స్నేహంగా ఉన్న వీరే శత్రువులుగా మారినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాదు చివర్లో `మన వాళ్ల కోసం మన వాళ్లనే చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు` అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా సాగింది.
కమర్షియల్ వాల్యుస్ తో కూడిన కథను దర్శకుడు విజయ్ కనకమేడల ఎగ్జైటింగ్గా, ఇంపాక్ట్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్రలో వెర్సటాలిటీ చూపించి అదరగొట్టారు,
ముఖ్యంగా శివ తాండవం సీక్వెన్స్ , చివరిలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో అద్భుతంగా కనిపించారు. మంచు మనోజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కట్టిపడేశారు. నారా రోహిత్ కూడా తన పాత్రను పవర్ఫుల్గా పోషించి ఆకట్టుకుంటారు. ఈ ముగ్గురు రెచ్చిపోయారు. వీరితోపాటు ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై పాత్రలు సైతం బలంగా కనిపిస్తున్నాయి. దీనికి శ్రీచరణ్ పాకాల బీజీఎం మరింత హైలైట్గా నిలిచింది.
మొత్తంగా హరి కె వేదాంతం కెమెరా వర్క్ సినిమాకు విజువల్ గ్రాండ్నెస్ తీసుకొచ్చింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, చిన్నా కె ప్రసాద్ ఎడిటింగ్ మరింత బలాన్ని ఇచ్చాయి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ పవర్ఫుల్గా ఆకట్టుకున్నాయి.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. దర్శకుడు కథ, సినిమాని తెరకెక్కించిన తీరు, యాక్షన్, ఎమోషనల్ సీన్లు, బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ల నటన ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి.