
ఏ ఫ్యాన్ కు ఏ విషయంలో ఎప్పుడు కోపం వస్తుందో ఏ స్టార్ కీ తెలియదు. వాళ్ళ స్టార్స్ పై కురిపించే ప్రేమాభిమానాలు ముందు మిగతావారికి చిన్నబోతూంటాయి. తక్కువగా కనిపిస్తూంటాయి. అలాంటప్పుడు ఎదుటివాళ్లు ఎంతటివారైనా తమ హీరోని గౌరవంగా సంభోదించకపోయినా తప్పుపడతారు...మండిపడతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మహేష్ ఫ్యాన్స్ ...సోషల్ మీడియాలో పూజా హెగ్డే ని కోప్పడుతున్నారు. ఇంతకీ కారణం ఏమిటీ అంటారా. వివరాల్లోకి వెళితే..
`మహర్షి` చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. మరో సారి ఈ జంట వెండితెరపై జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. `అతడు`, `ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న`సర్కారు వారి పాట` పూర్తి చేసి త్రివిక్రమ్ తో తదుపరి సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో మహేశ్ కి జంటగా పూజా నటించబోతోంది. ఈ విషయం ఖరారు చేస్తూ పూజ ..ఓ వీడియోలో చెప్పింది. కొద్ది రోజుల క్రితం ఎనౌన్స్ అయిన మహేష్ బాబు చిత్రంలో నేను చేయబోతున్నాను అన్నారామె. అయితే ఆమె మహేష్ సర్ అనలేదని ఫ్యాన్స్ వాదన...ఆవేదన. వారిలో కొందరు హిందీ సినిమాలు చేస్తోందని, సక్సెస్ తలకెక్కిందని ఇలా రకరకాలుగా ఆడుకుంటున్నారు ఆమెను. అయితే వీటికి ఆమె ఇప్పటిదాకా రిప్లై అయితే ఇవ్వలేదు.
ఇక ,అటు మహేశ్ తోనూ, ఇటు పూజతోనూ త్రివిక్రమ్కి ఇది మూడో సినిమా. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో పూజనే హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఈగర్గా వెయిట్ చేస్తోంది. థర్డ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే మహేశ్తో సినిమాను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.