త్రివిక్రమ్ చిత్రాలపై కాపీ ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన చిత్రాలు ఈ వివాదంలో చిక్కుకున్నాయి. లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సైతం కాపీనే అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే త్రివిక్రమ్ తరచుగా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అజ్ఞాతవాసి మూవీ విషయంలో త్రివిక్రమ్ అడ్డంగా బుక్ అయ్యాడు. ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ కథను తస్కరించిన త్రివిక్రమ్ ఇండియన్ నేటివిటీకి తగ్గట్లు మార్చి... అజ్ఞాతవాసి అని వండి వార్చాడు. లార్గోవించ్ డైరెక్టర్ ఫైర్ కాగా, సెటిల్ చేసుకున్నారు.
అంతకు ముందు నితిన్ హీరోగా తెరకెక్కించిన 'అ ఆ' సైతం కాపీ కథనే. యద్దనపూడి సులోచనారాణి రాసిన 'మీనా' నవలను కాపీ చేసి అ ఆ రూపొందించారు. ఇక అల వైకుంఠపురంలో మూవీకి ఎన్టీఆర్ 'ఇంటి గుట్టు' మూవీ స్ఫూర్తి. ఇంటి గుట్టు చిత్ర మోడరన్ రూపమే అల వైకుంఠపురంలో. ఈ చిత్రం ఇండస్ట్రీ కావడం విశేషం. తన సినిమాల్లోని కొన్ని సన్నివేశాల విషయంలో కూడా త్రివిక్రమ్ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ గుంటూరు కారం కథ కూడా ఒరిజినల్ కాదనే వాదన తెరపైకి వచ్చింది. యద్దనపూడి సులోచనారాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల కాపీ అంటున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే. ఈ కాపీ ఆరోపణ మాత్రం మహేష్ ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది.
గుంటూరు కారం మూవీలో శ్రీలీల హీరోయిన్. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ రోల్ చేస్తుంది. థమన్ సంగీతం అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. గుంటూరు కారం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ మేరకు అందుకుంటుందో చూడాలి...