
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. `గుంటూరు కారం` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన భావోద్వేగంతో కనిపించారు. గద్గద స్వరంతో ఆయన స్పీచ్ సాగింది. నాన్న సూపర్ కృష్ణ చనిపోయిన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా `గుంటూరు కారం`. ఆ బాధ మహేష్లో ఉంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన్నుకొచ్చింది. చిత్ర బృందంలో అందరికి ధన్యవాదాలు తెలిపారు మహేష్బాబు ఇక ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.
తాను హీరోగా ఎంట్రీ ఇచ్చి 25ఏళ్లు అవుతుందని ఏవీలో చూపించారు. నేను నమ్మలేకపోతున్నా. త్రివిక్రమ్ కూడా ఈ విషయాన్నే గుర్తు చేశారు. ఇన్నేళ్లు మీరు చూపించిన అభిమానాన్ని మర్చిపోలేను, మీ అభిమానం వల్లే ఇక్కడ ఉన్నానని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు మహేష్బాబు. `నాపై మీ అభిమానం ప్రతి ఏడాది పెరుగుతుంది. మీపై ప్రేమ పెరుగుతుంది. మాటలు లేవు, ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎప్పుడూ చెబుతూ ఉంటానుగా.. చేతులెత్తి దెండం పెట్టడం తప్ప ఏం చేయలేనని అంటూ స్టేజ్ పై అభిమానులకు దెండం పెట్టాడు మహేష్బాబు. దీంతో అభిమానులు కూడా ఆయనకు దెండం పెట్టడం విశేషం.
మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడూ ఎప్పటికీ, సంక్రాంతి నాకు బాగా కలిసొచ్చిన పండగ. నాకు, నాన్నగారికి. సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సారి కూడా బాగా గట్టిగా కొడతాం. బాగా గట్టిగా. కానీ ఈ సారి ఎందుకో చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఈ సినిమాలన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మా.. మీరే నాన్న. మీరే నాకు అన్నీ. మీ ఆశిస్సులు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని ఎమోషనల్ అయ్యారు మహేష్బాబు. మహేష్బాబు, శ్రీలీల కలిసి నటించిన `గుంటూరు కారం` చిత్రం సంక్రాంతికి రానుంది. జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు.