అందాల రాక్షసి ద్వారా అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తర్వాత మిస్టర్, రాధ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్థుతం తెలుగులో రామ్ సరసన ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంలో నటిస్తోంది లావణ్య. ఇక తమిళంలోనూ మంచి అకాశాలు దక్కించుకుంటూ కెరియర్ సాగిస్తోంది ఈ నార్త్ బ్యూటీ.
అయితే తాజాగా తమిళంలో రీమేక్ చేస్తున్న 100% లవ్ సినిమాతో లావణ్య చిక్కుల్లో కూరుకుపోయింది. నాని, నాగార్జున లాంటి హీరోల సరసన హిట్ చిత్రాల్తోలో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠి తాజాగా చిక్కుల్లో పడింది. లావణ్య నటించడానికి అంగీకరించిన చిత్ర షూటింగ్కు డుమ్మా కొట్టడంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలు లావణ్యపై చర్యలకు సిద్ధమయ్యారు. 100% లవ్ చిత్రాన్ని తమిళంలో చంద్రమౌళి దర్శకత్వంలో 100% కాదల్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. జీవీ.ప్రకాశ్కుమార్ హీరోగా నటిస్తున్న ఇందులో నటి లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.
ఈ చిత్ర షూటింగ్ను లండన్లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. అయితే అంతా రెడీ అయ్యి చిత్ర యూనిట్ లండన్కు బయలుదేరుతున్న సమయంలో లావణ్య డుమ్మా కొట్టిందట. దీంతో ఆగ్రహం చెందిన చిత్ర దర్శకుడు చంద్రమౌళి లావణ్యపై దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో పిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడం వల్ల తాము చాలా నష్టపోయామని, అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి స్పందించకుంటే... లావణ్య త్రిపాఠిపై తామే మరో విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరి ఈ చిక్కుల్లోంచి లావణ్య ఎలా బయట పడుతుందో.