
దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కల్కి' రెండో భాగం ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి భాగం 'కల్కి 2898 ఏడీ' పేరుతో జూన్ 27, 2024న విడుదలైంది. పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రాబోయే రెండో భాగంలోనూ కమల్ హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఆయనది విలన్ రోల్. సుప్రీం యాస్కిన్ పాత్రలో కనిపిస్తారు. అయితే, ఈ సినిమా కోసం కమల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి నటుడు యుగి సేతు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
"కల్కి సినిమాలో 20 రోజులు నటించినందుకు కమల్ హాసన్కు రూ.150 కోట్లు ఇస్తున్నారని అనుకున్నా. ఆయన పుట్టినరోజున కలిసి, 'సార్, మీరే ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులు. రోజుకు మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు' అని చెప్పాను. వెంటనే ఆయన నన్ను కల్కి నిర్మాత అశ్విని దత్ దగ్గరకు తీసుకెళ్లారు. నేను వాళ్లతో కూడా ఇదే విషయం చెప్పాను. అప్పుడు వాళ్లు, 'కమల్ సార్ ఇచ్చింది కేవలం 10 రోజుల డేట్స్ మాత్రమే' అని చెప్పారు. ఆ లెక్కన చూస్తే, కమల్ సార్ రోజుకు రెండు మిలియన్ డాలర్లు తీసుకుంటున్నారన్నమాట` అని యుగి సేతు వివరించారు.
'కల్కి 2898 ఏడీ' మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1250 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే రెండో భాగం షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే రెండో భాగానికి సంబంధించిన అమితాబ్ బచ్చన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకుంది. ఆమె స్థానంలో సాయిపల్లవిని తీసుకుంటున్నట్టు సమాచారం.