
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, కాజోల్ ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి జంట ఇప్పుడు బాలీవుడ్లో బెస్ట్ కపుల్గా ఉన్నారు. నేటి తరానికి ఇన్స్పైరింగ్గానూ ఉన్నారు. రెండు దశాబ్దాలుగా ఎలాంటి నెగటివ్ కామెంట్స్ లేకుండా వీరి వైవాహిక జీవితం సాగుతుంది. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు. కరోనా కారణంగా వీరంతా ఇంట్లోనే ఉన్నారు.
ఈ సందర్భంగా కాజోల్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా భర్త అజయ్ దేవగన్తో లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో రివీల్ చేసింది. ఆయన పరిచయం కావడానికి ముందు ఇద్దరూ గొడపడ్డారట. వీరిద్దరు ఫస్ట్ టైమ్ `హల్చల్` చిత్రంలో కలిసి నటించారు. 1995లో విడుదలైందీ చిత్రం. గొడవతో ప్రారంభమైన పరిచయం ప్రేమగా మారి, పెళ్ళి వరకు వెళ్ళిందట. అయితే ఈ మధ్యలో చాలా జరిగిందని చెబుతోంది కాజోల్.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, `ఇరవై ఐదేళ్ళ క్రితం `హల్చల్` చిత్రం షూటింగ్లో మేమిద్దరం ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం. నేను షాట్ కోసం రెడీ అయినప్పుడు.. నాతో నటించే హీరో ఎక్కడ అని అడిగాను. అతను ఓ మూలన కూర్చొని ఉన్నాడు. అతన్ని కలవడానికి ముందే ఓ విషయంపై గొడవ పడ్డాను. అనంతరం మేము సెట్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అజయ్ ఆ గొడవని వెంటనే మర్చిపోయారు. దీంతో మేం మంచి స్నేహితులమయ్యాం. అక్కడి నుంచి మా అనుబంధం మరింత పెరుగుతూ వెళ్ళింది. ఇద్దరం కలిసి విందులు, లాంగ్ డ్రైవ్లకు వెళ్లాం. మా బంధంలో సగం సమయం కారులోనే గడిచింది` అని తెలిపింది.
ఇంకా చెబుతూ, `నా ప్రేమ గురించి స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు నన్ను హెచ్చరించారు. అజయ్ అప్పటికే హీరోగా మంచి పేరు ఉందని అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కానీ ఆయన నాతో చాలా స్నేహంగా ఉండేవారు. ఆయన మనసేంటో నాకు తెలుసు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం మా నాన్నకు చెబితే ఆయన సీరియస్ అయ్యారు. నాలుగు రోజులు నాతో మాట్లాడలేదు. ఎంతో కష్టపడి వారిని ఒప్పించాను` అని తెలిపింది. ఇలా 1999, ఫిబ్రవరి 24న వీరిద్దరు వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
అయితే కాజోల్ ఇప్పుడిదంతా ఎందుకు చెబుతుందనుకుంటున్నారా? ఈ రోజు కాజోల్ బర్త్ డే. ఆమెని 46వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకి అజయ్ దేవగన్ విశెష్ తెలిపారు. `లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాను` అని ఓ ఫ్లవర్ సింబల్తో తెలిపారు. ఈ సందర్భంగా కాజోల్ తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఇప్పుడీ ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.