- హీరోయిన్ పూర్ణ కు గోల్డెన్ ఆఫర్
- అరవింద స్వామి సరసన హీరోయిన్ గా పూర్ణ
- తమిళంలో తెరకెక్కనున్న మూవీ
అరవింద స్వామి సరసన ఆఫర్ కొట్టేసిన పూర్ణ
అవును, సీమటపాకాయ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటి పూర్ణ తాజాగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో కూడా హీరోయిన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతాయని అందరూ అభిప్రాయపడుతుండగా ఆమెను వెతుక్కుంటూ ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. కానీ అది తెలుగులో కాదు తమిళంలో.
దర్శకుడు నిర్మల కుమార్ త్వరలో డైరెక్ట్ చేస్తున్న ‘శత్రుజ్ఞ వెట్టై 2’ సినిమాలో ఈమె నటుడు అరవింద స్వామికి జంటగా నటిస్తోంది. 2014 లో వచ్చిన ‘శత్రుజ్ఞ వెట్టై’ సినిమాకి సీక్వెల్ గా రానున్న ఈ చిత్రాన్ని మనోబాల నిర్మిస్తున్నారు.
దీని గురించి పూర్ణ మాట్లాడుతూ ‘చిన్నప్పుటి నుండి అరవింద స్వామి నా ఫెవరెట్ హీరో. ఎప్పటికైనా ఆయనతో నటించాలని ఉండేది. కానీ ఆయన సినిమాలు మానేశారు అని వినగానే చాలా బాధపడ్డాను. మళ్లీ ఆయన హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో ఆయనకు భార్యగా నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాది కాస్త డిఫరెంట్ రోల్. డిసెంబర్ చివరి వారం నుండి నా షూట్ మొదలవుతుంది’ అన్నారు.
ఈ సినిమాలో పూర్ణతో పాటు త్రిష కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా పూర్ణ తెలుగులో అలనాటి నటి రేఖ చేస్తున్న సినిమాలో సైతం నటిస్తోంది. సో అందం, అభినయం రెండూ ఉన్న పూర్ణకు అవకాశాలు పెరుగుతున్నాయన్నమాట.