
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రం విడుదలయింది. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సుహాస్ రోజు రోజుకి నిర్మాతలకు కాసులు కురిపించే పంటలా మారిపోతున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అనే నమ్మకం రావడంతో నిర్మాతలు, దర్శకులు అతడితో సినిమా చేసేందుకు ఎగబడుతున్నారు.
గత నెలలో అంబాజీ పేట చిత్రం విడుదలైంది. మే లో ప్రసన్న వదనం అనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంతలో మరో చిత్రాన్ని సుహాస్ ప్రారంభించాడు. నేడు సుహాస్ కొత్త చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'ఓ భామ అయ్యే రామ' అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ చిత్రంలో సుహాస్ కి జోడిగా యంగ్ బ్యూటీ మాళవిక మనోజ్ నటిస్తోంది. నువ్వునేను ఫేమ్ అనిత హస్సానందిని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఆమెకి ఇది తెలుగులో రీ ఎంట్రీ లాంటి చిత్రం. ఈ చిత్రాన్ని రామ్ గోధాల తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
నేడు ఈ చిత్ర పూజా కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్నారు. హీరో హీరోయిన్ పై ఆయన ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేమ కథగా తెరకెక్కబోతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.