
డైరెక్టర్ లింగుస్వామి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ మేరకు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో లింగుస్వామి సమంత, కార్తీ జంటగా ఓ తమిళ చిత్రం తీయాలనుకున్నారు. ఆ చిత్రానికి దర్శక నిర్మాతగా ఆయన వ్యవహరించారు. ఆ చిత్ర నిర్మాణం కోసం 2014లో పీవీపీ క్యాపిటల్ లిమిటెడ్ నుండి రూ. 1.03 కోట్లు రుణంగా తీసుకున్నారు. చిత్ర నిర్మాణం జరగలేదు. అప్పు చెల్లింపులో భాగంగా పీవీపీ సంస్థకు చెక్ ఇచ్చారు. లింగుస్వామి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది.
విచారణ అనంతరం సైదాపేట్ కోర్టు లింగుస్వామికి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ లింగు స్వామి మద్రాసు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ ప్రిన్సిపుల్ సెషన్స్ కోర్టు సైతం అదే తీర్పు వెలువరించింది.
లింగు స్వామి 2001లో తమిళ చిత్రం ఆనందం తో దర్శకుడు అయ్యాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. రన్, పందెంకోడి వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. తర్వాత ఆయన కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. ఇటీవల రామ్ పోతినేని హీరోగా ది వారియర్ మూవీ తెరకెక్కించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పరాజయం పొందింది. ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.