
ఈ మధ్య కళాకారులు.. అందులోను సింగర్స్ వరుసగా ప్రాణాలు వదులుతున్నారు. అందులో ర్యాపర్ ధర్మేశ్ కూడా ఉన్నారు. కాకపోతే మరీ 24 ఏళ్ల వయస్సులో ఆయన మరణించడం అందరిని కలిచివేస్తుంది. గల్లీబాయ్ ర్యాపర్ గా బాగా ఫేమస్ అయిన ధర్మేశ్ పార్మర్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ నిన్న హఠాన్మరణం చెందాడు. 24 ఏళ్ల చిన్న వయసులో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
అయితే విచిత్రం ఏంటీ అంటే.. అతడి మరణానికిగల కారణాలేంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిన్ననే ముంబైలో అతడి అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు. ఈ విషయాన్ని అతడు పార్ట్ నర్ గా ఉన్న యూట్యూబ్ చానెల్ స్వదేశీ వెల్లడించింది. స్వదేశీ కోసం అతడు పాడిన చివరి సాంగ్ ను పోస్ట్ చేసింది. ఘనంగా నివాళి అర్పించింది.
గల్లీబాయ్ లోని ఇండియా 91 పాటను టాడ్ ఫాడ్ పాడాడు. దానికి ర్యాప్ వెర్షన్ నూ సృష్టించాడు. అది చాలా ఫేమస్ అయింది. అందరి చూపు అతని వైపు తిరిగేలా చేసింది ఈ పాట. టాడ్ ఫాడ్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. విచారం వ్యక్తం చేశారు. గల్లీబాయ్ డైరెక్టర్ జోయా అక్తర్, హీరోలు రణ్ వీర్ సింగ్, సిద్ధార్థ్ చతుర్వేది సంతాపం తెలిపారు.
ఇక ధర్మేశ్ పార్మర్ పై సెలబ్రిటీలు వరుసగా ట్వీట్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోతావని ఊహించలేదు. నిన్ను కలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నా... నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. బాంటాయ్ అంటూ జోయా అక్తర్ ట్వీట్ చేసింది. టాడ్ ఫాడ్ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన రణ్ వీర్ సింగ్.. అతడి మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. చివరిసారిగా చేసిన చాటింగ్ వివరాలను సిద్ధార్థ్ చతుర్వేది ఇన్ స్టాలో షేర్ చేశాడు.