
హీరో రామ్ చరణ్-ఉపాసన వివాహం చేసుకొని పదేళ్లు దాటిపోయింది. వీరు చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు తెలియజేశారు. ఈ శుభవార్త మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా వారసుడు వస్తున్నాడన్న వార్తను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే ఈ పదేళ్ల జర్నీలో పిల్లల విషయంలో రామ్ చరణ్ దంపతులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. పలు విమర్శలు, పుకార్లు తెరపైకి రాగా వాటన్నింటినీ భరించారు. ఈ విషయాలపై ఉపాసన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'వివాహం జరిగినప్పుడే చరణ్, నేను పదేళ్ల వరకు పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాము. మేము తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేశాము. ఇప్పుడు ఇద్దరం మా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగాము. ఆర్థికంగా స్థిరపడ్డాము. మా పిల్లలకు ఏ లోటు లేకుండా అడిగింది ఇవ్వగలము' అని ఉపాసన అన్నారు.
'పిల్లల విషయంలో సమాజం, కుటుంబ సభ్యుల ఒత్తిడికి మేము తలొగ్గలేదు. ఇది మా మధ్య బంధాన్ని, అవగాహనను మరింత బలపరిచింది. సమాజంతో పని లేకుండా మేము కావాలనుకున్నప్పుడు తల్లిదండ్రులం అయ్యాము' అని ఉపాసన చెప్పారు. గతంలో కూడా ఉపాసన ఇదే తరహా కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడం పెద్ద బాధ్యత. వాళ్ళను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే సరిపోదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి, కోరింది సమకూర్చడానికి మనం సిద్ధం కావాలి. అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
వేల కోట్ల ఆస్తులు ఉన్న ఉపాసన పిల్లల్ని కనేందుకు ఆర్థిక కారణాలు చెప్పడం కొంచెం సిల్లీగా ఉంది. ఈ పదేళ్లలో రామ్ చరణ్ దంపతుల సంపద వెయ్యి కోట్ల నుండి రెండు వేల కోట్లకు పెరిగిందేమో. అంతకు ముందు వారేమీ పేదవాళ్ళు కాదు. ఉపాసన దృష్టిలో పిల్లల కోర్కెలు తీర్చడానికి, మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంకెంత సంపద ఉండాలో. ఆ లెక్కన సామాన్యులకు అసలు పిల్లల్ని కనే అర్హత కూడా లేనట్లు. లక్ష్యాల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదంటే ఒప్పుకోవచ్చు. ఆర్థికంగా స్థిరపడేందుకు అంటే మాత్రం నవ్వొస్తుంది. ఒక అంచనా ప్రకారం కేవలం ఉపాసన ఆస్తుల విలువ పదివేల కోట్లు. ఆమె అపోలో గ్రూప్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు.