
వివాదాస్పద విషయాలపై సినిమాలు తీసేటప్పుడు చాలా సమస్యలు , బెదిరింపులు వస్తాయి.కొందరు వాటిని దాటి ముందుకు వెళ్లి సినిమాలు పూర్తి చేయగలుగుతారు. మరికొందరు సినిమా కోసం అంత రిస్క్ వద్దనుకుంటారు. అదే క్రమంలో సినీ నిర్మాత సందీప్ సింగ్ తన కొత్త సినిమా ‘టిప్పు సుల్తాన్’ తెరకెక్కించే ఆలోచనను విరమించుకున్నారు. కుటుంబం, స్నేహితులకు బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రకటించారు. టిప్పు అభిమానుల నుండి తనకు, తన కుటుంబానికి, స్నేహితులకు బెదిరింపులు రావడమే ఇందుకు కారణమని చెప్పారు. టిప్పు సల్తాన్ సినిమాను నిలిపివేస్తున్నట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
‘‘హజ్రత్ టిప్పు సుల్తాన్ చేయడం లేదు. నన్ను, నా స్నేహితులను, కుటుంబ సభ్యులను బెదిరించడం, దూషణలు చేయడం దయ చేసి, ఆపేయండి. ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే క్షమించండి. ఇది కావాలని చేసినది కాదు. ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరి నమ్మకాలను నేను గౌరవిస్తాను. ఇక నుంచైనా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుందాం’ అని సందీప్ సింగ్ పేర్కొన్నారు.
ఇక పవన్ శర్మ దర్శకత్వంలో ‘టిప్పు సుల్తాన్’ చేస్తున్నట్లు నిర్మాత సందీప్ గతంలో ప్రకటించారు. హజ్రత్ టిప్పు సుల్తాన్ సినిమాను సందీప్, ఈరోస్ ఇంటర్నేషనల్, రష్మీ శర్మ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. మేలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని ప్రకటించారు.
సినిమా ప్రకటించిన సమయంలో, టిప్పు సుల్తాన్ గురించి వాస్తవం తెలుసుకొని తాను షాకయ్యానని సందీప్ చెప్పారు. ‘ఇది నేను వ్యక్తిగతం విశ్వసించి చేస్తున్న చిత్రం. నా సినిమాలు సత్యం వైపు నిలబడతాయి. చరిత్ర పుస్తకాల ద్వారా ఆయన్ను ఒక గొప్ప వీరుడిగా చిత్రించి మన బ్రెయిన్వాష్ చేశారు. కానీ, టిప్పు సుల్తాన్ గురించి ఎవరికీ తెలియని క్రూరమైన మరో పార్శ్వాన్ని మేము చూపించబోతున్నాం. భవిష్యత్ తరాల కోసం ఆయన చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు. దర్శకుడు పవన్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఈ ప్రకటనతో సందీప్పై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురి నుంచి బెదిరింపులు రావడంతో సినిమా నిర్మించే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఈ సినిమాను తీయడం లేదని ప్రకటించారు.