
హీరోయిన్గా రాణించి విశేషంగా మెప్పించిన నటి యమున ఇప్పుడు సీనియర్ లో నటిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఆమె `విధి`, `అన్వేషిత`, `మౌన పోరాటం`, `దేవి` , `అమృతం`, `రక్త సంబంధం`వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె గతంలో ఓ సందర్భంలో వ్యభిచార కేసులో ఇరుక్కుంది. బెంగుళూరులో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుపడిందనే వార్తలొచ్చాయి. కానీ దానిపై ఆమె కోర్ట్ కెళ్లింది. తనకు ఏ సంబంధం లేదని కోర్ట్ నుంచి క్లీన్ చీట్ కూడా తెచ్చుకుంది. కానీ దీనికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని, తనని వెంటాడుతున్నాయని వాపోయింది నటి యమున.
ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోని పంచుకుంది. తన ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలియని ఓ బాధ అయితే నన్ను వెంటాడుతూనే ఉంది. అది కూడా సోషల్ మీడియా వల్ల. ఎందుకంటే నేను ఏళ్ల క్రితమే ఓ ప్రాబ్లమ్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఆ ప్రాబ్లమ్లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయం సాధించాను, నేను గెలిచాను, కానీ సోషల్ మీడియానే నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్నెయిల్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. నేను వాటికి సంబంధించిన వీడియోలను చూడను. వాటిల్లో ఏం ఉందో నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆ థంబ్ నెయిల్స్ మాత్రం నన్ను చాలా బాధపెడుతున్నాయి.
ఈ విషయంలో నన్ను ఎంత నేను మోటివేట్ చేసుకున్నా..నేనూ మనిషినే కదా, తెలియని బాధ వస్తుంటుంది. నేను ఒక్కటే అనుకుంటాను, నేను ఆ థంబ్నెయిల్స్ చూస్తుంటే నేను చనిపోయినా కూడా నన్ను వీళ్ళు వదలరు అనిపిస్తుంది. అప్పటికీ కూడా ఏదో ఒకటి రాసి నా పేరుతో డబ్బులు సంపాదించుకుంటారనుకుంటా. నా ఫ్యామిలీకి నేను ఏంటో తెలుసు, వాళ్లకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ని కూడా చాలా తెలుసు. తెలియని వాళ్లు, నన్ను దగ్గర్నుంచి చూసినవాళ్ల నుంచి తెలుసుకోండి. సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజం కాదు, వాటిని నమ్మకండి` అని వెల్లడించింది నటి యమున. ఇన్స్టాలో పంచుకున్న ఈ వీడియో వైరల్ అవుతుంది.