విశాల్ తో సినిమా అని మోసం చేసిన దర్శకుడు!

By AN TeluguFirst Published Aug 22, 2019, 10:06 AM IST
Highlights

నటుడు విశాల్‌ హీరోగా చిత్రం చేసిపెడతానని చెప్పి దర్శకుడు వడివుడైయాన్‌ మోసం చేసినట్లు ఓ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రముఖ తమిళ హీరో విశాల్ హీరోగా సినిమా చేస్తానని దర్శకుడు వడివుడైయాన్ తనను మోసం చేసినట్లు ఓ వ్యారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై, విరుగంబాక్కమ్, వేంకటేశన్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డులో  నరేశ్‌ బోద్రా అనే వ్యాపారవేత్త  నివసిస్తున్నాడు. ఈయన సినిమా నిర్మాతగా మారాలని దర్శకుడు వడివుడైయాన్ తన వద్ద నటుడు విశాల్ కాల్షీట్స్ ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించి సినిమా చేస్తానని చెప్పారు.

ఈ క్రమంలో ఒప్పందం కుదుర్చుకున్న నరేష్ బోద్రా అందుకు రూ.47 లక్షలు దర్శకుడికి ఇచ్చారు. 2016 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఆ మొత్తాన్ని దర్శకుడు తీసుకున్నాడు. అయితే వడివుడైయాన్ సినిమా చేయకుండా సమయం వృధా చేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చి విశాల్ తో చేసిన ఒప్పందం పరిశీలించగా అవి నకిలీ అని తెలిసింది.

దీంతో ఆ నిర్మాత డబ్బు తిరిగివ్వాలని దర్శకుడిని అడగగా.. అతడు ఇవ్వకుండా మోసం చేయడంతో నరేశ్‌ బోద్రా మంగళవారం విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులను దర్శకుడిని విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు వడివుడైయాన్‌ బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

అందులో నిర్మాత నరేష్ ఎవరో తనకు తెలియదని.. అతనితో తనకు ఎలాంటి పరిచయం లేదని తెలిపారు. తాను గతేడాది అశోక్ బోద్రా అనే వ్యక్తి నుండి అప్పుగా మూడు లక్షలు 
తీసుకున్నానని.. దానికి ఒప్పందపత్రం రాసిచ్చినట్లు తెలిపారు. ఆ డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేశానని.. అయినా ఒప్పంద పత్రం తిరిగివ్వలేదని తెలిపారు. ఆ పత్రాన్ని అశోక్‌బోద్రా నిర్మాతగా చెప్పుకుంటున్న నరేశ్‌బోద్రాకు ఇచ్చి ఉంటాడనే అనుమానం కలుగుతోందని.. ఈ వ్యవహారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని చెప్పారు. 

click me!