
ప్రఖ్యాత సినీ దర్శకుడు తేజ పైరసీ వ్యతిరేక పోరాటంలో మరో మెట్టు ఎక్కారు. హైదరాబాదుకు చెందిన ఏఐ స్టార్టప్ న్యూరానిక్స్తో కలిసి, తేజ ఇండియాలో మీడియా & ఎంటర్టైన్మెంట్ రంగాన్ని రక్షించే పరిష్కారాలను అభివృద్ధి చేసి జాతీయ యాంటీ-పైరసీ చాలెంజ్ అవార్డును గెలుచుకున్నారు.
ఈ అవార్డు తేజకు ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. "పైరసీ సృజనాత్మకతకు పెను సవాల్. ఆన్ లైన్ లో మన కంటెంట్ వచ్చేశాక టేక్డౌన్ చేయడం సరికాదు. మొదటి రోజు నుంచే కంటెంట్ రక్షణ అవసరం. అందుకే మేము న్యూరానిక్స్తో భాగస్వామ్యం చేశాం," అని తేజ తెలిపారు. "ఆమీర్తో నా అనుభవం సినిమాటోగ్రాఫర్గా ప్రారంభమైంది. ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్."
భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన WAVES 2025 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇందులో “Create in India Anti-Piracy Challenge” పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 1,600 సంస్థలు పాల్గొన్నాయి. ఈ పోటీలో న్యూరానిక్స్ విజయం సాధించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీలకు పెద్ద ప్రోత్సాహకరంగా మారనుంది.
WAVES 2025 ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ కూడా సందర్శించి, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ విజన్లో భాగంగా మీడియా, సెక్యూరిటీ, కల్చర్ రంగాల్లో ఇంటెలిజెంట్ పరిష్కారాల అవసరాన్ని హైలైట్ చేశారు. "పైరసీకి వ్యతిరేకంగా మోదీ గారి గట్టి ఆలోచనలు మనకు ప్రేరణను ఇస్తున్నాయి. ప్రభుత్వ మద్దతుతో ఇండస్ట్రీకి నిజమైన రక్షణ సాధ్యమవుతుంది," తేజ అన్నారు.
ప్రస్తుతం భారత మీడియా, వినోద రంగం ప్రతి సంవత్సరం పైరసీ వల్ల సుమారు $1.2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. దీనికి సమర్థవంతమైన, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలు అత్యవసరం. న్యూరానిక్స్తో పాటు తేజ తేజరాక్ట్ కంపెనీ ఈ రంగంలో భారతదేశం సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నాయి.
తేజ “నువ్వు నేను”, “జయం”, “నిజం” వంటి బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. గత రెండు దశాబ్దాల్లో 1,000 మందికి పైగా నటులను పరిచయం చేసిన తేజ, పైరసీకి వ్యతిరేకంగా సాంకేతిక పరిష్కారాలను అందించి మరోసారి తన కృషిని చాటుకున్నారు.