
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల(Srinu Vaitla ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా, కందులపాలెంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో Director Srinu Vaitla కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి ఫ్యామిలీ తీవ్ర దిగ్ర్భాంతికి గురవుతుంది. కృష్ణారావుకి కుమారుడు, దర్శకుడు శ్రీనువైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు.
శ్రీనువైట్ల తండ్రి మరణించాడనే వార్తతో సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. దర్శకుడికి ఫోన్ చేసి తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావు ఆత్మకి శాంతిచేకూరాలని, శ్రీనువైట్ల ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనువైట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పరాజయం చెంది.
ఇటీవల కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా దర్శకుడు శ్రీనువైట్ల 1999లో రవితేజ హీరోగా `నీకోసం` సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `ఆనందం`, `సొంతం`, `ఆనందమానందమాయే` చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. రవితేజతో చేసిన మరో `వెంకీ`తో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకుని టాప్ డైరెక్టర్లో ఒకరిగా మారిపోయారు. చిరంజీవితో `అందరి వాడు`, మంచు విష్ణుతో `ఢీ`, రవితేజతో `దుబాయ్ శీను`, `రెడీ`, `కింగ్`, `నమో వెంకటేశాయా`, `దూకుడు`, `బాద్షా`, `ఆగడు`, `బ్రూస్లీ`, `మిస్టర్` చిత్రాలకు దర్శకత్వం వహించారు. `దూకుడు` ఆయన కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మంచు విష్ణుతో `ఢీ` సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.