నిర్మాత దిల్ రాజు.. ఓ పెద్ద సస్పెన్స్ కి తెరదించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ `గేమ్ ఛేంజర్`. శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలున్నాయి. దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీనికి మూడు వందల కోట్లకుపైగానే బడ్జెట్ అయినట్టు సమాచారం. అయినా రాజీపడకుండా చేస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ ఇప్పటి వరకు ఎంత వరకు షూటింగ్ అయ్యింది, ఇంకా ఎంత ఉందనేది తెలియదు.
శంకర్ ఇటీవల మాట్లాడుతూ రామ్ చరణ్ పాత్రపై షూటింగ్ అయిపోయిందన్నారు. మిగిలిన పాత్రలకు సంబంధించిన షూటింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పనిలో శంకర్ బిజీగా ఉన్నాడు. ఇందులో రామ్ చరణ్కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. వీరితోపాటు శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందనేది తెలియదు. నిర్మాత దిల్ రాజు ఇన్నాళ్లు దాటవేస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెరుగుతుంది. అభిమానులు ఎక్కడ కలిసినా `గేమ్ ఛేంజర్` రిలీజ్ అప్ డేట్ గురించే అడుగుతున్నారు. తాజాగా ఆయన ధనుష్ హీరోగా నటించిన `రాయన్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు `గేమ్ ఛేంజర్` అప్ డేట్ కోసం పట్టుపట్టారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అసలు విషయం లీక్ చేశాడు దిల్ రాజు. `క్రిస్మస్ కి కలుద్దాం` అంటూ చెప్పేశాడు. `గేమ్ చేంజర్` ని క్రిస్మస్కి విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.
దీంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో వారంతా హ్యాపీ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల శంకర్ రూపొందించిన `భారతీయుడు 2` నిరాశ పరిచింది. అయితే ఈ ప్రభావం ఇప్పుడు రామ్ చరణ్ మూవీపై ఉంటుందనే వాదన ప్రారంభమైంది. బిజినెస్ పరంగా దెబ్బ పడుతుందని అంటున్నారు. మరి అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇక ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రిగా, కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి పాత్రలో సీఎంగా, కొడుకు పాత్రలో ఐఏఎస్ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.