టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ ఎం ఎస్ ధోని.. సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన `ఎల్జీఎం` పేరుతో ఓ సినిమాని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. టీమిండియాకి రెండోసారి ప్రపంచ కప్ తీసుకొచ్చారు. 2011లో వరల్డ్ కప్ తేవడంలో ఆయన పాత్ర కీలకమైందనే విసయం తెలిసిందే. కెప్టెన్గా, బ్యాట్స్ మెన్గా, కీపర్గా ఆయన ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఇప్పుడు సినిమా రంగంలోనూ తన అభిరుచిని చాటేందుకు వస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలని తలపించారు. అందుకోసం నిర్మాణ రంగంలోకి దిగారు. ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని స్థాపించారు.
ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై `ఎల్జీఎం` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. దీనికి తన భార్య సాక్షి ధోని నిర్మాతగా ఉన్నారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యోగిబాబు, మిర్చి విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇచ్చారు ధోని. తన భార్య సాక్షితో కలిసి ఆయన ఈ సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సినిమాని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చేందుకు ధోని, సాక్షి మీడియా ముందుకు వచ్చారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే ట్రైలర్ని, ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ, `కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా `LGM` సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుంది. `LGM` చిత్రానికి ప్రేక్షకులు తమ ప్రేమ, ఆదరణను అందిస్తారని భావిస్తున్నాం` అని అన్నారు. ఇటీవల విడుదలైన `LGM` టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. డిజిటల్ ఫ్లాట్ఫామ్లో 7 మిలియన్స్కు పైగా వ్యూస్ను ఇది సాధించింది.