
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దేశం మొత్తం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కలలో కూడా ఊహించని విధంగా పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో గుండెపోటుకు గురయ్యారు. దీనితో ఆయన శనివారం రోజు మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ స్నేహితులకు, అభిమానులకు, ఫ్యామిలీకి, సెలబ్రిటీలకు హృదయం బద్దలయ్యే షాక్ ఇది.
Puneeth Rajkumar మరణం తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించింది. భారీ బందోబస్తు నడుమ పునీత్ అంతిమ యాత్ర, అంత్యక్రియలు జరిగాయి. అయితే పునీత్ ని అవమానిస్తూ ఓ నెటిజన్ ఆకతాయి పని చేశాడు. దీనితో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
సదరు నెటిజన్ మద్యం బాటిల్ తో పునీత్ గురించి పోస్ట్ పెట్టాడు. దీనితో అతడిపై పునీత్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. చేయడంతో సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేసింది. అతడిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. పునీత్ మరణం తర్వాత ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం బెంగుళూరులో మద్యం విక్రయాలు నిలిపివేశారు. దీనిని ఉద్దేశిస్తూ సదరు నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
కుటుంబం, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన వేళ ఇలాంటి ఆకతాయి పనులు ఏంటి అంటూ పునీత్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్ తనయుడిగా పునీత్ రాజ్ కుమార్ నటనలో వారసత్వాన్ని కొనసాగించారు. స్టార్ హీరోగా కన్నడనాట తిరుగులేని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పునీత్ కు ఎంతో అనుబంధం ఉంది. చిరంజీవి, బాలయ్య, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పునీత్ కు ఎంతో స్నేహం ఉంది.