
చిరంజీవి నటించిన `ఆచార్య`, రానా, సాయిపల్లవి నటించిన `విరాటపర్వం` చిత్రాలకు చుక్కెదురయ్యింది. ఈ సినిమాలకు సెన్సార్ చేయోద్దని, వీటిని విడుదలకు అనుమతి ఇవ్వకూడదని యాంటీ టెర్రరిజమ్ ఫోరమ్ హైదరాబాద్లోని రీజనల్ సెన్సార్ బోర్డ్ కి ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం సెన్సార్ రీజనల్ ఆఫీసర్ బాలకృష్ణని యాంటీ టెర్రరిజమ్ ఫోరమ్ సభ్యులు కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
మావోయిజం, నక్సలిజం భావజాలను ప్రశంసించే, ప్రోత్సహించే సినిమాకు ధృవీకరణ పత్రం ఇవ్వవద్దని వారు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి, రామ్చరణ్ నటిస్తున్న `ఆచార్య`, రానా దగ్గుబాటి, సాయిపల్లవి నటిస్తున్న `విరాటపర్వం` సినిమాల ద్వారా నక్సలైట్లని హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తమకి సమాచారం అందిందని, ఈ రెండు సినిమాలు యువతపై దుష్ర్పభావం చూపించే అవకాశం ఉందని, అందుకు ఈ రెండు సినిమాల పూర్తి కథను, కథ సారాంశాన్ని, సినిమాని క్లీయర్గా పరిశీలించాలి.
వీటితోపాటు భవిష్యత్లో ఏ సినిమాలోనైనా దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా నక్సలైట్స్ ని హీరోగా చూపించే విధంగా ఉంటే వాటికి అనుమతులు ఇవ్వకూడదని, లేని పక్షంలో థియేటర్ల వద్ద ఆయా సినిమాల ప్రదర్శనని అడ్డుకుంటామని యాంటీ టెర్రరిస్ట్ ఫోరమ్ చైర్మన్ రావి నూతల శశిధర్ తెలిపారు. అంతర్గత భద్రత, దేశ సమగ్రత, అమరవీరులకు నివాళిగా, మావోయిజం, నక్సలిజం భావజాలంతో నిర్మించే సినిమాలపై సెన్సార్ బోర్డ్ నిషేధించాలని శశిధర్ సెన్సార్ బోర్డ్ కి మెమోరండం రూపంలో ఫిర్యాదు చేశారు.
రానా, సాయిపల్లవి జంటగా, వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` చిత్రం రూపొందింది. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. మరోవైపు చిరంజీవి హీరోగా, రామ్చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతుంది. కాజల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని మే 13న విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు నక్సల్స్ ప్రధానంగా, వామపక్ష ఉద్యమం నేపథ్యంలో రూపొందిన చిత్రాలు కావడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సీపీఆర్ఎఫ్ పోలీసు సిబ్బందిపై నక్సలైట్లు దాడికి పాల్పడ్డారు. ఇందులో 22 మంది జవానులు కన్నుమూశారు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు `ఆచార్య`, `విరాటపర్వం` సినిమాలపై కూడా పడింది. అయితే సినిమాని సినిమాగా చూడాలి. దాన్ని రాజకీయం చేయడం సరికాదనే కామెంట్ కూడా వినిపిస్తుంది.