
తెలంగాణ యువకుడిగా రాహుల్ సిప్లిగంజ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హుషారెత్తించే పాటలు పాడుతూ గాయకుడిగా బాగా పాపులర్ అయ్యారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ దాకా వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆస్కార్ వేదికపై పాట పాడే అరుదైన గౌరవాన్ని రాహుల్ సిప్లిగంజ్ సొంతం చేసుకున్నాడు.
గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు. రాహుల్ సిప్లిగంజ్ తన కెరీర్ లో సింగరేణి ఉంది, రంగా రంగా రంగస్థలానా, ఓ మై గాడ్ డాడీ, నాటు నాటు లాంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. బార్బర్ వృత్తి చేసే పేద కుటుంబం నుంచి మొదలైన రాహుల్ సిప్లిగంజ్ ప్రయాణం ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ స్థాయికి ఎదిగే వరకు చేరింది. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని విజేతగా నిలిచారు.