
టాలీవుడ్ పెద్దలుగా ఉన్నారు చిరంజీవి, మోహన్ బాబు. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజ నటులు మధ్య స్నేహం చిగురించింది. కొత్తగా స్నేహం చిగురించడం ఏమిటీ.. వాళ్లకు ఎప్పటి నుండో పరిచయం ఉంది కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ కొన్నాళ్ల వరకు చిరంజీవి, మోహన్ బాబు ఉప్పు, నిప్పుగా ఉన్నారు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకలో వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. చిరంజీవి కి లెజెండరీ నటుడు పురస్కారం ఇచ్చి, మోహన్ బాబుకు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 500 సినిమాలకు పైగా నటించిన నేను ఎవరికంటే తక్కువ కాదని మోహన్ బాబు వేదిక సాక్షిగా ప్రశ్నించారు.
మోహన్ బాబు మాటలకు పవన్ కళ్యాణ్, చిరంజీవి ఘాటుగా స్పందించారు. వాళ్ళు కూడా సందర్భాన్ని మరచి పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుండి వీరి మధ్య దూరం పెరిగింది. ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లుగా మోహన్ బాబు, చిరంజీవి ప్రాణ మిత్రులుగా ఉంటున్నారు. ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చుకోవడం, విషెస్ తెలుపుకోవడం చేస్తున్నారు. వీరి పిల్లలు మంచు విష్ణు, మనోజ్, చరణ్ కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇది మంచి పరిణామమే అని చెప్పాలి.
కాగా మోహన్ బాబు, చిరంజీవి కలిసి చిన్న వీకెండ్ ట్రిప్ కి వెళ్లారట. మంచు ప్రాంతం సిక్కిం కి వీరిద్దరూ కలిసి ట్రిప్ కి వెళ్లడం జరిగిందట. చిరు, మోహన్ బాబు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్న మంచు లక్ష్మీ... ఈ విషయాన్ని బయటపెట్టారు. చిరంజీవి అంకుల్ తో నాన్న మోహన్ బాబు ట్రిప్ కి వెళ్లడం నాకు ఈర్ష్యగా ఉందంటూ ట్వీట్ చేశారు.