
ప్రముఖ బాలీవుడ్ నటీమణి రీమా లగూ (59) కన్నుమూశారు. బాలీవుడ్లో అమ్మ పాత్రలకు వన్నె తెచ్చిన ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రీమా ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
1970, 1980 దశకాల్లో రీమా బాలీవుడ్లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. బాలీవుడ్ సూపర్హిట్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’లో ఆమె సల్మాన్కు తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా వచ్చి ఇక్కడా విజయవంతమైంది. ఖయామత్ సే ఖయామత్ తక్, సాజన్, దిల్వాలే, కుచ్ కుచ్ హోతా హై, కల్ హో న హో. ఆక్రోశ్, ఆషిఖీ, హమ్ ఆప్కే హౌ కౌన్, దిల్ తేరా దివానా తదితర సినిమాల్లో నటించారు.
1958లో జన్మించిన రీమా.. బుల్లి తెరపై వచ్చిన 'శ్రీమాన్ శ్రీమతి'లో నటించి ఎంతో మంది అభిమానుల సంపాదించుకున్నారు. కామెడీ సీరియల్ 'తు తు మై మై'లో కూడా నటించారు. సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 1990 మైనే ప్యార్ కియా చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకోగా, 1991 ఆషికి చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.
1995 హహ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2000 వాస్తవ్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇలా ఎన్నో అవార్డులు ఆమె సినీ ఖాతాలో ఉన్నాయి. హిందీ, మరాఠీ భాషల్లో పలు ధారావాహికల్లోనూ నటించారు.