సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగా ఉన్నాయి.
‘ఆకాశం నీ హద్దురా’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య.. కంటెంట్ ఓరియంటెడ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తన స్టైల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ‘జై భీమ్’ రిలీజైంది. పవర్ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్టైంది. సూర్య పేదల తరపున అండగా నిలబడే పవర్ఫుల్ లాయర్గా కనిపించారు. 2 డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా సంచలనం రేకెత్తిస్తోంది. సామాజికంగా నిమ్న వర్గాల అణచివేతపై తీసిన జైభీమ్ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విస్తృత చర్చకు దారితీసిన జైభీమ్ హీరో సూర్యపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా వ్యంగ్యాస్త్రాలు విసరటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అందుకు కారణం ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కావడమే. బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా ట్విటర్ వేదికగా సూర్యపై తనదైన స్టైల్లో సెటైర్లు విసిరారు. గతంలో సూర్య అన్న మాటలను తీసుకుని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
https://twitter.com/HRajaBJP/status/1455846747889029125
జాతీయ విద్యా విధానం (నెప్)లో భాగంగా పిల్లలు మూడు భాషల్లో విద్య నేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ఓ వ్యక్తి తన సినిమా (జై భీమ్)ను మాత్రం ఐదు భాషల్లో విడుదల చేశారని, దీనిని బట్టి అతడెంత స్వార్థపరుడో అర్థం చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన వారు చాలామంది సూర్య గట్టిగానే బదులిస్తాడని భావించారు. అయితే సూర్య మాత్రం సింపుల్గా ఆ ట్వీట్ను ‘లైక్’ చేసి అక్కడితో ఆ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేశారు.
సూర్య అద్భుతంగా, ఎంతో విజ్ఞతతో వ్యవహరించాడని ట్విటరాటీలు కొనియాడుతున్నారు. అమెజాన్లో లాంగ్వేజ్ను ఎంచుకునే అవకాశం ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆ అవకాశం లేదని కొందరు కామెంట్ చేస్తూ సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరైతే ఆ ట్వీట్ను లైక్ చేయడం ద్వారా బీజేపీ నేతను సూర్య ట్రోల్ చేశాడని అంటున్నారు.
బీజేపీ నేత ట్వీట్ వెనక గల కారణాన్ని ఓసారి పరిశీలిస్తే.. 2019లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (నెప్)ను నటుడు సూర్య తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామీణ విద్యార్థుల భవితను ఇది సర్వనాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యావిధానంపై ప్రతి ఒకరు ఆందోళనంగా, ఆగ్రహంగా, బాధగా ఉన్నారని పేర్కొన్నారు.
‘‘విద్యార్థులకు నాణ్యమైన, సమాన విద్యను అందించడంపై దృష్టిపెట్టకుండా, ప్రవేశ పరీక్షలపై మాత్రమే దృష్టిపెట్టి నూతన విద్యావిధానాన్ని తీసుకురావడంపై ప్రజలు కోపంగా, ఆవేదనగా ఉన్నారు. దేశంలోని 30 కోట్ల మంది గ్రామీణ విద్యార్థులపై ఇది ప్రభావం చూపుతుంది. వారు తరగతులకు ఎలా హాజరవుతారు? అంతెందుకు నా పిల్లలకు మూడో భాషను నేర్పడం నాకే సవాలుగా మారుతుంది’’ అని పేర్కొన్నాడు. నాటి సూర్య వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే బీజేపీ నేత ఇప్పుడు ఈ విమర్శలు చేశారు.