ఆనాడు ఊర్వశి శాపం.. ఈనాడు వరమైంది.. నర్తనశాల ట్రైలర్‌

By Aithagoni RajuFirst Published Oct 22, 2020, 6:53 PM IST
Highlights

ఇప్పటికే బాలకృష్ణ లుక్‌ని, శ్రీహరి, సౌందర్య లుక్‌లను విడుదల చేశారు. వాటికి విశేషమైన స్పందన లభించింది. తాజాగా గురువారం సాయంత్రం నిమిషం నిడివి గల ట్రైలర్‌ని విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం `నర్తనశాల`. శరత్‌కుమార్‌, శ్రీహరి, బాలకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ప్రారంభించి కొంత భాగం చిత్రీకరించారు. కొన్ని అవాంతరాలు రావడంతో మధ్యలోనే ఆపేశారు. ఆ ఫీడ్‌ని 17నిమిషాలు గల సినిమాగా విడుదల చేస్తున్నారు. శ్రేయాస్‌ఈటీలో ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. 

ఈ సందర్భంగా ఇప్పటికే బాలకృష్ణ లుక్‌ని, శ్రీహరి, సౌందర్య లుక్‌లను విడుదల చేశారు. వాటికి విశేషమైన స్పందన లభించింది. తాజాగా గురువారం సాయంత్రం నిమిషం నిడివి గల ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో `ఈ అజ్ఞాతవాసం విజయవంతంగా ముగియవలేనన్న,..నా పైనే ఎక్కువ భారమున్నది... ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం..ఇనాడు నా పాలిట వరమైంది.ఇక మన దాయాదులు ఎంత మంది వేగులను పంపినను వారి పాచికలు పారవు. ఎత్తుగడలు సాగవు. ద్రౌపది సమేత మా పాండుకుమారుల తరపున మీకు ఇవే మా నమస్సుమాంజలి` అని అర్జునిడిగా బాలకృష్ణ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

ఈ ట్రైలర్‌లో ప్రధానంగా పాండు కుమారులు, ద్రౌపది అజ్ఙాతవాసం వెళ్ళడం.. అక్కడ వాళ్ళు పడిన ఇబ్బందులు, పడిన ఘర్షణలు, పోరాటం, చివరికి అజ్ఙాతవాసం ముగియడం వంటి సన్నివేశాలున్నాయి. అక్కడడక్కడి సన్నివేశాలు కత్తిరించి పెట్టినట్టుగానే ఉందిగానీ సహజత్వం లేదు. కొంత భాగమే కాబట్టి అలా ఊహించుకోవడం కరెక్ట్ కాదేమో. ఇక శ్రీహరి వాయిస్‌ సెట్‌ కాలేదు. సౌందర్య కనువిందుగా అలరించింది. ఆమె చెప్పే `పాండురాజు తనయులకు లేని కష్టం నాకా?` అని సౌందర్య చెప్పే డైలాగ్‌ బాగుంది. మొత్తానికి ఈ ట్రైలర్‌ సినిమాని చూడాలనే ఆసక్తిని రేకెత్తించింది. 17నిమిషాల నిడివి సినిమానే అయినా ఓ స్పెషల్‌ ఇంట్రెస్ట్ ని మాత్రం క్రియేట్‌ చేస్తుంది. 
 

click me!