
`తడాఖా` చిత్రంతో టాలీవుడ్లో మెరిసి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది ఆండ్రియా జెరెమియా. మరోవైపు కమల్ హాసన్తో నటించిన `ఉత్తమవిలన్`తోనూ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తమిళంలో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ `నో ఎంట్రీ`. ఆర్ అళగు కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జంబో సినిమాస్ బ్యానర్పై శ్రీధర్ అరుణాచలం నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది తమిళంలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.
సోమవారం విడుదల చేసిన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. గూస్బంమ్స్ తెప్పిస్తుంది. నాలుగు కుక్కలు కలిస్తే ఏనుగునైనా చంపేయగల శక్తి వాటి సొంతం. అదే వాటి బలం పెరిగితే, వాటి బలం పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం ఏమైంది? కుక్కల్లో పుట్టిన అతి భయంకరమైన వైరస్ మనుషులపై ఎలా దాడి చేసిందనే ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా ఈ ట్రైలర్ సాగింది. చూడ్డానికి ఇది జాంబి జోనర్ మూవీలా ఉంది. కుక్కలు మనుషులను కరవడం, మనుషులు, మనుషులనే కరవడం వంటి సన్నివేశాలు సినిమాపై ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో ఆండ్రియా అదరగొట్టింది.
దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన కొంత మంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీనుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఎంతో థ్రిల్లింగ్గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు ఆర్. అళగు కార్తీక్ వెల్లడించారు. అదవ్ కణ్ణదాసన్,రన్యరావ్, మానస్, జయశ్రీ, జాన్వీ ఇతర కీలకపాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.