
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం `అఖండ`. బ్లాక్ బస్టర్ విజయం సాధించి కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకి పండగ కళ తీసుకొచ్చింది. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ఇప్పటికే విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ముచ్చటించారు. నేడు బుధవారం(డిసెంబర్ 29) తన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాలయ్య గురించి, `అఖండ` గురించి, తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
`అఖండ` సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ముందే ఊహించానని తెలిపారు మిర్యాల రవీందర్రెడ్డి. కాకపోతే ఈ విషయాన్ని బాలయ్య, బోయపాటి దాస్తూ వచ్చారని, కానీ నేను మాత్రం మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. ఈ సినిమా ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని, ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని మొదట్నుంచి తాను నమ్మినట్టు చెప్పారు నిర్మాత. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారి అభిమానులకు కావాల్సిన మాస్ సాంగ్ కూడా ఉంది. అఘోర పాత్ర అద్భుతంగా పండిందన్నారు. సినిమా షూటింగ్ ముగిసిన తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాను. చాలా సహకరించారు. థ్యాంక్స్ సర్ అని అన్నారు. లేదు లేదు మీరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, బాగా చేశారు అని బాలకృష్ణ గారు అన్నారు.
నాలుగు రోజుల్లోనే బయ్యర్స్ బయటపడతారని అనుకున్నాను. ఓవర్సీస్లో ఆడుతుందా? లేదా? అని ఆలోచించలేదు. ఒకప్పుడు ఒక్క డైరెక్టరే పది సినిమాలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ దర్శకుడు ఒక సినిమాను చేయడమే కష్టం. స్టార్ హీరోలకు పది ప్లాఫులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే సెట్ అవుతుంది. స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే. నేను అదే నమ్ముతా. `అఖండ` సినిమా విషయంలో దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. బాలకృష్ణ కెరీర్ మొత్తంలో నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి.
`ప్రభుత్వాలు అనేవి ప్రజలకు ప్రాతినిధ్యంగా వహిస్తాయి. వ్యక్తులు, సంస్థల కోసం ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వవు. మా సినిమా విడుదల సమయంలో సినిమా పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.అలాంటి సమయంలో నేను ఏమీ మాట్లాడకూడదని అనుకున్నా. ఈ విషయం మీద ఎలా మాట్లాడినా కూడా వివాదంగానే మారుతుంది. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను పెట్టమని ఇండస్ట్రీ వాళ్లే అడిగారు. దాని వల్ల పారదర్శకత ఉంటుంది. మా సినిమా విడుదల విషయంలో ప్రభుత్వం కొంత సపోర్ట్ చేసింది. త్వరలోనే అన్ని టికెట్ల రేట్ల సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాక్కూడా ఉంది. ఒక వేళ హిందీలో రీమేక్ చేయాలనుకుంటే.. ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది. నేను స్టార్ హీరోలతోనే కాదు అందరితోనూ సినిమాలు చేస్తాను. వచ్చే ఏడాది మార్చిలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతోన్నాను. ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశల్లో ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. అడ్వాన్స్లు ఇచ్చి హీరోలను బుక్ చేసుకోవడం నాకు తెలీదు. ఎవరైనా కథ చెబితే.. నచ్చితే.. దానికి తగ్గట్టు హీరోలకు వినిపించడమే అలవాటు` అని చెప్పారు నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి.