
ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` చిత్రం శుక్రవారం విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. భారీ నెగటివిటీ, భారీ ట్రోలింగ్స్ నడుమ ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ రాబట్టుకోవడం విశేషం. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ వీకెండ్(ఆదివారం) వరకు సినిమా గట్టిగానే ఆడే అవకాశం ఉంది. అయినా సినిమాపై విమర్శలు ఆగడం లేదు. రామాయణం తెలిసినవాళ్లు, గతంలో రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు చూసినవాళ్లు, కొందరు పండితులు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. రామాయణాన్ని వక్రీకరించారని, తమకు నచ్చినట్టు చేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా ట్రోల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది యూనిట్. ఈ సినిమాకి సంబంధించిన అసలు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసింది. తాజాగా చిత్ర రైటర్ మనోజ్ ముంతశిర్ స్పందిస్తూ, మేం తీసింది రామాయణం కాదంటూ బాంబ్ పేల్చారు. తాము సంపూర్ణ రామాయణం తీయలేని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, తాము రామాయణం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాని తెరకెక్కించామని చెప్పారు. తాము తీసింది సంపూర్ణ రామాయణం కాదని, కేవలం రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే `ఆదిపురుష్` సినిమాని రూపొందించామని వెల్లడించారు.
అయితే ఈ విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతూ వస్తున్నామని, సినిమా ప్రారంభంలో వచ్చే డిస్ క్లైమర్లోనూ ఆ విషయాన్ని స్పష్టంగా మెన్షన్ చేశామని వెల్లడించారు. దీనిపై నెగటివిటీ పెరిగిన నేపథ్యంలో తాను మళ్లీ దీని గురించి వివరణ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీశామని, అంతేకానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదని చెప్పారు. మొత్తానికి `ఆదిపురుష్`పై వస్తోన్న విమర్శలకు ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. స్ప్రెడ్ కావాల్సిన దానికంటే ఎక్కువే నెగటివిటీ స్ప్రెడ్ అయ్యింది. అంతా అయిపోయాక ఇప్పుడు వివరణ ఇచ్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది.
ముందుగానే ఆడియెన్స్ ని ఈ సినిమాకి సంబంధించిన వాస్తవాలను చెప్పి ప్రిపేర్ చేయాల్సింది. ముందుగా పూర్తి రామాయణం కాదని చెబితే ఎక్కడ హైప్ తగ్గిపోతుందని అనుకున్నారో ఏమో అప్పుడు ఆ విషయాన్ని బలంగా చెప్పలేకపోయారు. పూర్తి రామాయణం తీయలేదని, తాము ఇన్స్పైర్ తమ స్టయిల్లో, మోడ్రన్గా, నేటి యువతకు ఆకట్టుకునేలా చేశామనే విషయాన్ని గట్టిగా, బలంగా జనాల్లోకి వెళ్లేల చేస్తే ఇప్పుడు ఇన్ని విమర్శలు, ఇంత నెగటివిటీ వచ్చేది కాదంటున్నారు విశ్లేషకులు. సినిమా డిస్క్లైమార్ లో మెన్షన్ చేసినట్టు రైటర్ తెలిపారు. కానీ ఆడియెన్స్ దాన్ని పెద్దగా చదవరు, పట్టించుకోరు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడితే ఏం ప్రయోజనం అనేది క్రిటిక్స్ వాదన.
ఇక ఓం రౌత్ రూపొందించిన `ఆదిపురుష్` సినిమాలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించింది. రావణ్గా సైఫ్ అలీ ఖాన్, భజరంగ్గా దేవదత్త, శేష్(లక్ష్మణుడు)గా సన్నీ సింగ్ నటించారు. ఈ సినిమా మోడ్రన్ రామాయణంగా తెరకెక్కించారు. సీతని రావణుడు ఎత్తుకెళ్లడం, సీత కోసం రాముడి తపించడం, రావణ్ని అంతం చేసి సీతని తీసుకురావడం వరకు ఈ సినిమాలో చూపించారు. దీనికి `అవెంజర్` స్టయిల్ మేకింగ్ని యాడ్ చేశారు. రావణ్ వర్గం మొత్తం సూపర్ విలన్స్, తానోస్లను ప్రతిబింబించేలా ఉండటం గమనార్హం. టీ సిరీస్ నిర్మించిన ఈ సినిమా సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. రిలీజ్కి ముందే దాదాపు నాలుగు వందల కోట్ల బిజినెస్ చేసింది. 3డీలో రూపొందిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. తొలి రోజు ఈ సినిమా రూ.140కోట్లు వసూలు చేసింది. శనివారం, ఆదివారం కలెక్షన్లపై ఈ సినిమా హిట్టా?ఫ్లాఫా ? అనేది తేలనుంది.